నంద్యాల ఉప ఎన్నిక తర్వాత ప్రతిపక్ష పార్టీనుంచి ….అధికార పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయనె వార్తలు సంచలనం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ పార్టీని వీడుతారన్న వార్తలను ఆయన ఖండించారు. కొన్ని చానళ్లు తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగు జాడల్లో నడుస్తానని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్కుమార్ స్పష్టం చేశారు. టీవీ చానెళ్లు ప్రత్యక్ష్యంగా చూసినట్టు తాను నియోజకవర్గ నాయకులతో సంప్రదిస్తున్నానని నిరాధారమైన విషయాలను టీవీలో చూపెట్టడం సమంజసం కాదన్నారు. త్వరలో నవరత్నాలతో తమ అధినేత ప్రజల్లోకి వస్తున్నారని, దీన్ని చూసి భయపడే అధికారపార్టీ ఇలాంటి నీచమైన మైండ్గేమ్లకు పాల్పడుతోందని విమర్శించారు.
టీడీపీ ఆస్థానపత్రికలు, పచ్చటీవీలు ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నంద్యాలలో కోట్లాదిరూపాయులు డబ్బులు కుమ్మరించి, అధికార దుర్వినియేగానికి పాల్పడి గెలిచారని విమర్శించారు. నంద్యాల గెలుపును చూసి మురిసిపోవద్దని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.