నంద్యాల ఉప ఎన్నిక చివిరిరోజు అధికార , విపక్షాల మధ్య సవాల్లు తారాస్థాయికి చేరాయి. తాజాగా శిల్పా మోహన్రెడ్డి చంద్రబాబు నాయుడి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ప్రచారం సందర్భంగా చంద్రబాబునాయుడు, మంత్రి అఖిలప్రియ తనపై చేసిన దుష్ర్పాచారాన్ని ఖండించారు. తాను ఎప్పుడూ ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు.
తమ కుటుంబం నిర్వహిస్తున్న శిల్పా సేవాసమితిలో అక్రమాలు జరుగుతున్నట్లు చంద్రబాబు చేసిన అరోపణలపై మండిపడ్డారు. తాము నిర్వహిస్తున్న సేవాసమితి కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి విచారణైనా జరిపించుకోవచ్చని సవాలు విసిరారు.
నాలుగు మాసాల క్రితం వరకూ తనను, తమ సేవాసమితిని ఎన్నోమార్లు ప్రశంసించిన చంద్రబాబుకు తాను వైసీపీలో చేరగానే తాను అక్రమార్కుడిని అయిపోయానా? అంటూ నిలదీసారు. నియోజకవర్గంలో అభివృద్ధికి తాను చంద్రబాబును ఎన్నోమార్లు విజ్ఞప్తి చేసిన ‘నిధులేమన్నా చెట్లకు కాస్తున్నాయా’ అంటూ ప్రశ్నించటం అందరికీ తెలిసిందేనన్నారు.
తాము నిర్వహిస్తున్న మహిళా బ్యాంకులో అధిక వడ్డీ తీసుకుంటున్నామని, అక్రమాలు చేస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు. తాము నడుపుతున్న సహకార బ్యాంకు నష్టాల్లో ఉన్నా ఇంకా నడుపుతున్నామంటే కేవలం సేవాభావం ఉండబట్టేనని స్పష్టం చేసారు. ఎన్నికలకోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడిని చంద్రబాబు ప్రభుత్వం ఈ సవాల్ను స్వీకరిస్తుందా …?