సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా దేశంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. భాజాపాను నిలువరించేందుకు ప్రతిపక్ష పార్టీలు పొత్తుల సన్నాహాల్లో ఉన్నారు. అయితే కాంగ్రెస్తో పొత్తుల విషయంలో ఆపార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి సొంత పార్టీలో ఎదురు దెబ్బ తగిలింది. 2019 ఎన్నికల్లో భాజాపాను అధికారంలోకి రాకుండా చేయడానికి కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొనే విషయంలో పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు.
కాంగ్రెస్తో పొత్తు ప్రతిపాదనలను కేంద్ర కమిటీ తోసిపుచ్చడంతో, ఆయన రాజీనామాకు సిద్ధమైనట్టు సమాచారం. 2019లో బీజేపీ ఓటమే పార్టీ ప్రధాన లక్ష్యమని ఆరు నెలల క్రితం సీపీఎం తీర్మానం చేసింది. ఈ నేపథ్యంలో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు బీజేపీ వ్యతిరేక కూటమితో చేతులు కలపాలని ఏచూరి ఓ ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనను కేంద్ర కమిటీ తిరస్కరించింది. కాంగ్రెస్ పార్టీవి మోసపూరిత రాజకీయాలని… ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని సీనియర్ నేత ప్రకాశ్ కారత్ అన్నారు.
పొత్తు విషయంలో పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఓటింగ్ నిర్వహించారు. ప్రస్తుతం సీపీఎం కేంద్ర కమిటీలో 91 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో కారత్ కు 55 మంది ఓటు వేయగా, 31 మంది ఏచూరి ప్రతిపాదనకు మద్దతు పలికారు. దీంతో, ఏచూరి మనస్థాపానికి గురయ్యారు. రాజీనామాకు సిద్ధపడ్డ సీతారాం ఏచూరిని బుజ్జగించేందుకు సీనియర్లు రంగంలోకి దిగారు.