ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలంటూ తెలుగుదేశం ఎంపీలు గత కొన్ని రోజులుగా ఢిల్లీ నిరసన తెలియచేస్తూనే ఉన్నారు. కానీ.. కేంద్ర మాత్రం స్పందించడం లేదు. తెలుగుదేశం ఎంపీలు రోజుకో రీతిలో తమ నిరసన తెలియజేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలుకొట్టినట్టు మాట్లాడే అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ టీడీపీ తరపున చేసే పోరాటాలన్నీ బూడిదలో పోసిన పన్నీరేనని దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తనకు ఈ వాస్తవం తెలిసినా పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాన్ని కాదనలేక నిరసన పోరాటాల్లో పాల్గొంటున్నానని జేసీ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మోదీ మొండి వైఖరి తెలిసిననందువల్లే తాను ఈ రకంగా మాట్లాడుతున్నానని దివాకర్ రెడ్డి అన్నారు.
ప్రత్యేక హోదా అనే పదం కాకపోయినా, దానికి సమానంగా తగిన నిధులు కేటాయిస్తే తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు. కేంద్రం తాము కోరే విధంగా తగిన నిధులు కేటాయిస్తే, ఏపీ ప్రజలను ఒప్పించే బాధ్యత తాను తీసుకుంటానని ఆయన అన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరపున కొందరు దూతలు తనను కలిసి పార్టీ మారమని ఆఫర్ ఇచ్చారని జేసీ.దివాకర్ రెడ్డి చెప్పారు. కానీ పార్టీ మారాలన్న ఆ ప్రతిపాదనను తాను తోసిపుచ్చానని జేసీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన గల్లంతవడం ఖాయమని దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఆయన ఒక్కడే కదా ప్రత్యేక హోదా గురించి సీరియస్గా పోరాడుతున్నాడు అనగానే అక్కడున్న మిగిలిన ఎంపీలందరూ ఖంగుతిన్నారు