వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై టాలీవుడ్ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళీ ప్రశంసల వర్షం కురిపించారు. శ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైయస్ జగన్ను ఆయన శనివారం కలిశారు. జగన్తో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.
జగన్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించడానికే వచ్చానని, రాష్ట్రంలో ఇప్పుడున్న నేతల్లో మెరుగైన నేత జగన్ అని కొనియాడారు. అధికారం కోసం హామీ లిచ్చే రకం జగన్ కాదని చెప్పిన పోసాని, పవన్ కల్యాణ్ శక్తి ఏమిటనేది ఇంకా తెలియదని అన్నారు.
జగన్లోని నిజాయితీ, మాట మీద నిలబడే తత్వం తనకు నచ్చాయని చెప్పారు. ‘జగన్లోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింది. అందుకే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాను’ అని తెలిపారు. మూడు వేల కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆయన చేస్తున్న పాదయాత్ర అసాధారణం’ అని పోసాని వ్యాఖ్యానించారు
సమస్యల పరిష్కారంపై నిబద్ధత కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఓటువేసి ముఖ్యమంత్రిని చేయండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఓటు వేస్తే మీరే మళ్లీ మళ్లీ ఆయనను గెలిపిస్తారు.’ అని పోసాని కృష్ణమురళీ చెప్పారు.
‘దైవసాక్షిగా.. నా కుటుంబ సాక్షిగా.. నా మీద ఒట్టు వేసుకుని చెబుతున్నా జగన్ చాలా మంచివాడు. టీడీపీ ప్రభుత్వంలో జరగని అన్ని వర్గాల పనులు వైయస్ జగన్ చేస్తాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను’ అని పోసాని చెప్పారు. జగన్ అంతకుముందు ముఖ్యమంత్రుల కంటే చాలా సమర్ధంగా పనిచేస్తారని అన్నారు. లేకపోతే తనను చెప్పుతో కొట్టండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.