ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలె జరిగిన మహానుడకు
తాను రాజకీయ కుట్రలకు బలయ్యానని.. అప్పుడు ఎన్టీ రామారావు కూడా అలాగే బలయ్యారని విమర్శించారు. ‘రాజ్యాధికారం కోసం పిల్లనిచ్చిన మామని చంపారు.. నందమూరి, దగ్గుబాట కుటుంబాన్ని వాడుకొని వదిలేశారు. అన్ని కుట్రలకు కుతంత్రాలకు బాబే కారణ. మాట మీద నిలబడే వాడు నాయకుడు.. అవసరాల కోసం మారే వాడు కాదు. అలాంటివాళ్లకు చరిత్రలో నల్లటి పేజీ మిగిలిపోతుందని గమనించాలి’ అన్నారు మోత్కుపల్లి.
ఎన్టీఆర్ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించాడు. మా నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబే. సరిగ్గా ఎన్టీఆర్పై చేసినట్లే కేసీఆర్పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారు. కానీ పట్టపగలే అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి, చంద్రబాబులు ముద్దాయిలు. తన అవసరాల కోసం మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టిన బాబు.. ఇప్పుడు బీసీలకు, కాపులకు మధ్య కొట్లాట పెడుతున్నారు. చివరకు బ్రాహ్మణులు మధ్య చిచ్చురేపిన మేధావి. నిజంగా ఈ వ్యవస్థకు చంద్రబాబు పెద్ద ముప్పని విమర్శించారు.
తన రాజకీయ జీవితం కూడా నాశనం అయ్యిందన్నారు మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ముందు గవర్నర్ పదవి అన్నాడని ఆతర్వాత రాజ్యసభ పదవని చివరకు మొండిచేయి చూపారన్నారు. రాజ్యసభ సీట్లను రూ. 100 కోట్లకు అమ్ముకున్నాడని మండి పడ్డారు.
ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. ముందు ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. తర్వాత మాట మార్చి హోదా అంటూ నాటకాలు ఆడుతున్నారు. ప్యాకేజీ అద్భుతమంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి మరి.. మోదీపై ప్రశంసలు కురిపించలేదాని ప్రశ్నించారు. టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి.. లేకపోతే ప్రజలు తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.