నవంబర్ 2 నుండి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర కు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను పాదాయాత్ర వాయిదా పడకుండా కొనసాగించాలని పట్టదలతో ఉన్నారు. పాదయాత్రలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమావేశం అయ్యి చర్చించారు.
2వ తేదీ నుంచి ఆరు నెలలపాటు ఆయన పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆ పార్టీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత జగన్పై సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు హాట్టాపిక్గా మారాయి. పాదయాత్ర చేసినంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతారనుకుంటే… అంతకన్నా మూర్ఖత్వం మరొకటి ఉండదని అన్నారు. జగన్ పాదయాత్ర ముమ్మాటికీ పొలిటికల్ స్టంటేనని తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా రాదనే విషయంఅందరికి తెలుసునని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అధ్యాయమని తెలిపారు. ఏపీ ప్రజలను మభ్యపెట్టేందుకే ప్రత్యేక హోదా వాగ్దానం చేశారని అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ మూడేళ్లుగా చెబుతున్నారని… వాళ్లు ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలని ఎద్దేవా చేశారు.
గతంలో టీడీపీకి దగ్గరవుతున్నారనె వార్తలు హల్ చేశాయి. దానిపై ఆమె పదిహేను రోజుల క్రితం స్పందించారు. తనకు టిడిపితో ఎలాంటి సంబంధం లేదని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గిరిజన ప్రజాప్రతినిధులకు అన్యాయం చేస్తోందని ఆమె వాపోయారు. హఠాత్తుగా కొత్తపల్లి గీత పార్టీ అధినేత జగన్ పాదయాత్రపై ఘాటు వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. తనకు టిడిపితో సంబంధం లేదని చెప్పిన కొద్ది రోజులకే జగన్ పాదయాత్ర స్టంట్ అని, పాదయాత్రతో సీఎం కాలేరని చెప్పడంపై పార్టీలో చర్చ జోరుగా సాగుతోంది.
