ఏపీ సిట్ బృందానికి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ షాకిచ్చారు. సిటీ న్యూరో సెంటర్లో డిశ్చార్జీ అయ్యే ముందు సిట్ బృందం జగన్ను కలిశారు. ఈ ఘటనలో బాధితుడైన వైఎస్ జగన్ వాంగూల్మం తీసుకోవడానికి శుక్రవారం ఉదయం సిట్ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. అయితే ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదని ..తెలంగాణ పోలీసులు వస్తే స్టేట్ మెంట్ ఇస్తానని జగన్ చెప్పినట్టు సమాచారం.
గురువారం నాడు విశాఖ ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్పై శ్రీనివాసరావు అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటనపై ఏపీ డీజీపీ ఠాగూర్ విశాఖ పోలీసులతో సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి తాను వాంగూల్మం ఇవ్వనని జగన్ ఖరాఖండిగా చెప్పారని తెలుస్తోంది.
దీంతో ఏపీ పోలీసులకు ఏం చేయాలో అర్థం కాలేదట. వారికి ఎలాంటి వాంగూల్మం ఇవ్వకుండానే జగన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. జగన్ స్టేట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో సిట్ బృందం వెను దిరిగారు. అయితే జగన్ స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో సిట్ తర్వాత ఏం చేయనుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
విశాఖపట్నం విమానాశ్రయంలో గురువారం జగన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. శ్రీనివాసరావు అనే యువకుడు కోడిపందేల కత్తితో జగన్ భుజంపై దాడి చేశాడు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న జగన్.. లోటస్పాండ్లోని ఆయన నివాసానికి సమీపంలో ఉన్న సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేరారు.
కత్తికి విషపూరిత రసాయనాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేయడంతో.. జగన్ను 24 గంటలపాటు పరిశీలనలో ఉంచి శుక్రవారం మధ్యాహ్నం డిశ్చార్జి చేశారు.