తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర రూట్ అనూహ్యంగా మారింది. ఇదే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠకు తెరలేపుతోంది. ఉన్నట్టుండి జగన్ తన రూట్ మ్యాప్ను ఎందుకు మార్చారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం పెద్దాపురంలో పర్యటిస్తున్న జగన్ షెడ్యూల్ ప్రకారం తరువాత పిఠాపురం వెళ్లాలి.
పిఠాపురం నుంచి కత్తిపూడి వెళ్లాల్సిన జగన్ ఇప్పుడు తన షెడ్యూల్ లో లేని జగ్గంపేట కు వెళ్లనున్నారు. అంతేకాదు ఆ నియోజకవర్గంలో మూడు రోజులు ఉండేలా జగన్ పాదయాత్ర షెడ్యూల్ ను సవరించారు. అయితే ఇప్పుడు ఈ అంశమే రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకు జగన్ తన పాదయాత్ర రూట్ మార్చుకొని ఉంటారనే విషయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
శనివారం భారీ బహిరంగ సభను కూడా జగ్గంపేటలో నిర్వహించనున్నారు. ఆ మరుసటి రోజే అన్ని నియోజకవర్గాల ఇన్చార్జ్లతో సమావేశం ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ తరపున జ్యోతుల నెహ్రు గెలిచారు. కానీ ఆ తర్వాత పార్టీ ఫిరాయించారు. ఈనేపథ్యంలో జ్యోతుల చంటిబాబుకు వైసీపీ జగ్గంపేట బాధ్యతలు అప్పగించారు. జిల్లాలోకి వచ్చిన జగన్ను ఒకటికి రెండుసార్లు వైసీపీ జగ్గంపేట కోఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు.
జ్యోతుల చంటిబాబు విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించిన జగన్ తర్వాత మాట మార్చుకున్నారంట. దీంతో జగన్ పాదయాత్ర కాకినాడ నుంచి అటే వెళ్లిపోతుందనుకున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ ఇక్కడకు వస్తున్నారని తెలియడంతో ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారట.
శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా జ్యోతుల నెహ్రు ఫిరాయించినా బలం తగ్గలేదని చూపించాలని వైసీపీ భావిస్తోంది. జ్యోతుల చంటిబాబు కూడా తనను నమ్మించి మోసం చేసిన టీడీపీకి ఈ సభ ద్వారా తమ సత్తా ఏంటో చూపించాలని భావిస్తున్నారు.
జగ్గంపేట నియోజకవర్గంలో కాపులు అధికశాతం ఉండడం…గతంలో కాపు రిజర్వేషన్ కోసం జగ్గంపేట నియోజకవర్గం నుంచి ఆందోళనలు వెల్లువెత్తిన సందర్భంగా జగన్ తాను ఇక్కడ ఏర్పాటు చేసే సభలో కాపులకు రిజర్వేషన్పై జగన్ ఏమాట్లాడతారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.