సుదీర్ఘ పాదయాత్రలో నిమగ్నమైవున్న వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి తేరుకోలేని షాక్ తగలనుంది. విజయవాడ రాజకీయాల్లో కేంద్ర బిందువు అయిన వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధ వైకాపాకు గుడ్బై చెప్పి అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇదే జరిగితే విజయవాడ రాజకీయాలు మరోసారి కీలక మలుపుతిరిగే అవకాశం ఉంది.
రాధతో చర్చలు పూర్తయ్యాయని కొందరు టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానించారు. తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఖాయం చేసిన పక్షంలో పార్టీ మారేందుకు రాధ సిద్ధంగా ఉన్నారనీ, ఈ విషయమై తమతో చర్చించారని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారనం విజయవాడ సెంట్రల్ టికెట్ను మల్లాది విష్ణుకు జగన్ కేటాయించారనే దాంతోనే రాధ పార్టీ మారనున్నారని ప్రచారం జరుగుతోంది.
మూడు నాలుగు నెలల క్రితం వరకూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ వెంటే నడిచి, ఆపై పార్టీకి కాస్తంత దూరమైనట్టు కనిపించిన విజయవాడ కాపు సామాజిక వర్గం కీలక నేత వంగవీటి రాధ, తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు ఫ్లాష్ అయిన వార్త పెను సంచలనాన్నే కలిగించింది. ఆయన చేరికపై అధికారిక ప్రకటన వెలువడక పోయినప్పటికీ, ఇప్పుడు విజయవాడ ప్రాంతంలో ఏ ఇద్దరు కలిసినా ఈ విషయంపైనే చర్చ సాగుతోంది.
కొద్దికాలం క్రితం మల్లాది విష్ణు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఆయనకు విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ టికెట్ ను వైఎస్ జగన్ కన్ఫార్మ్ చేశారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆ సీటుపై వంగవీటి రాధ ఎప్పటినుంచో ఆశలతో ఉన్నారు. విష్ణు రంగ ప్రవేశం తరువాతనే రాధ తొలిసారిగా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతోనే రాధ టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఇప్పుడు రాధ టీడీపీ నుంచి ఆ సీటు తనకిస్తానన్న హామీ వస్తే, పార్టీ మారుతానని చెప్పినట్టు ఆయన అనుచర వర్గం అంటున్న పరిస్థితి. వాస్తవానికి విజయవాడ సెంట్రల్ పరిధిలో మల్లాది విష్ణుతో పోలిస్తే, వంగవీటి రాధ బలమైన నేతగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రాధకు టీడీపీ నుంచి అసెంబ్లీ సీటును ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సిఉంది.