జియో రావడంతో.. ఇండియన్ టెలికం రంగంలో మిగిలిన కంపెనీలకు గట్టి దెబ్బ తగిలింది. దాంతో తమ టారిఫ్ రేట్లను భారీగా తగ్గించేస్తున్నాయి. జియో ఇచ్చిన షాక్ తో.. ఎయిర్ టెల్, వొడాఫోన్ దిగొచ్చి, అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను వినియోగదారుల ముంగింట్లోకి తెచ్చాయి. వీటి బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త టారిఫ్ ప్లాన్లో భాగంగా కేవలం రూ.99తో రీ ఛార్జ్ చేసుకుంటే నెల రోజుల పాటు లోకల్ కాల్స్ , బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చు. ఇక ఈ ఆఫర్లోనే 300 ఎంబీ డేటా కూడా ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
ఈ రేటుతో ఈ ఆఫర్ మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖాండ్, అసోం, గుజరాత్ రాష్ట్రాలలో అందుబాటులో ఉంటుంది. ఇదే ఆఫర్ ఇతర సర్కిళ్లలో రూ.119 నుంచి రూ.149కు కల్పిస్తామని కంపెనీ పేర్కొంది. మరో ఆఫర్లో రూ.339కు నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ ను బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్ వర్క్ కైనా చేసుకునేలా అవకాశం కల్పిస్తూ 1జీబీ డేటాను అందుబాటులో ఉంచింది.. ఇప్పటికే 30 రోజుల వాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ 3జీ సర్వీసులను రూ.1099కు అందిస్తోంది.
Related