సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పేరు తెలియని వారుండరు. కొన్ని ముఖ్యమైన కేసుల్లో చూపించిన తెగువతో ఎంతోమంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. లక్ష్మీనారాయణ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. యువతలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
మహారాష్ట్ర అదనపు డీజీపీగా పనిచేస్తున్న లక్ష్మీ నారయణ స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు మహారాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ మేరకు విఆర్ఎస్కు ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది . రాజకీయాల్లోకి వచ్చేందుకు లక్ష్మీనారాయణ ఉద్యోగానికి స్వస్తి చెప్పారని మొదటి నుంచి ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఆయన ఖండిస్తున్నారు.
స్వచ్ఛంద పదవీ విరమణ ఆమోదం పొందిన తరువాత లక్ష్మీ నారాయణ తొలిసారి గుంటూరులో మీడియా ముందుకు వచ్చారు. తాను తొలుత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నానని, ప్రజా సమస్యలు తెలుసుకున్నాక, తన ప్రణాళిక తెలుపుతానని అన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా అవసరమని, హోదాతో కంపెనీలు ఇక్కడికి తరలివచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. కాగా, తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని ఆయన తేల్చి చెప్పారు.