ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో పరాజయం పాలైన భారత జట్టుకు మరో షాక్ తగిలింది. సిడ్నీ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా నిర్ధిష్ట సమయానికి ఇన్నింగ్స్ ముగించలేదని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ఒక ప్రకటనలో తెలిపాడు. కోహ్లి సేన ఒక ఓవర్ తక్కువగా వేసిందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఫీల్డ్ అంపైర్లు రాడ్ టక్కర్, గెరార్డ్ అబూద్ స్లో తన దృష్టికి తీసుకొచ్చారని వెల్లడించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించినట్టు రిఫరీ ప్రకటనలో తెలిపాడు.
ఇక ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్థిష్ట సమయానికన్నా తక్కువగా ఓవర్లు వేస్తే ఒక్కో ఓవర్ చొప్పున ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. తాజా ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లి సేనకు జరిమానా విధించడం ఇది రెండోసారి. మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే సమయంలో ఒక ఓవర్ స్లోగా ఇన్నింగ్స్ ముగించినందున 20 శాతం జరిమానా విధించారు. ఇదిలాఉండగా.. మూడు వన్డేల సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై సిరీస్ కోల్పోయిన టీమిండియా… వరుసగా రెండు టీ20లల్లో విజయం సాధించి సిరీస్ ఖాతాలో వేసుకుంది.
కాగా, మూడో టీ20లో భారత్ 12 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేగయగా.. 187 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేయగలిగింది. ఇకపోతే, ఇరు జట్ల మధ్య నాలుగు టెస్టు సిరీస్లో భాగంగా మొదటి డే నైట్ టెస్టు అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17 నుంచి మొదలుకానుంది.