టీమిండియా స్వదేశంలోనూ, విదేశాల్లోనూ తీరిక లకుండా సుదీర్ఘంగా మ్యాచ్లు ఆడుతున్న సంగతి తెలిసిందే.దీంతో ఆటగాళ్లు గతంలో బీసీసీఐ పై అసంతృప్తిని వ్యక్తపరిచారు.దాంతో జట్టులోని కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో జరిగే ట్రైసిరీస్ కోసం కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మహేంద్రసింగ్ ధోనీ, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యకు విశ్రాంతినివ్వాలని బోర్డు భావిస్తోంది.
కెప్టెన్గా విరాట్ స్థానంలో హిట్మ్యాన్ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తోంది. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్కు కెప్టెన్ రోహిత్ వ్యహరించిన సంగతి తెలిసిందే. దీంతో మరికొంత మంది యువ ఆటగాళ్లకు లంకలో పర్యటించే జట్టులో అవకాశం కల్పించనున్నారు.
సౌతాఫ్రికాలో దాదాపు రెండు నెలలపాటు సాగిన పర్యటన శనివారం జరిగే ఆఖరి టీ20 మ్యాచ్తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో విశ్రాంతికి సంబంధించి ఆటగాళ్లు, బోర్డు మధ్య పరస్పరం అవగాహనకు వచ్చినట్లు టీమిండియా బృందంలోని ఓ సభ్యుడు వెల్లడించాడు.
ట్రైసిరీస్ కోసం సెలక్షన్ కమిటీ ఈ ఆదివారం సమావేశమై జట్టును ఎంపిక చేయనుంది. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఢిల్లీ, ఆంధ్ర మ్యాచ్ అనంతరం సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్, ఇద్దరు సెలక్టర్లు ఢిల్లీ వికెట్ కీపర్-బ్యాట్స్మన్ రిషబ్ పంత్తో చర్చించారు. ధోనీ స్థానాన్ని రిషబ్తో భర్తీ చేసే అవకాశముంది. కేదార్ జాదవ్కు చోటు దక్కే అవకాశం లేదు. సఫారీ పర్యటనలో ఒక్క మ్యాచ్ మినహా మిగతా మ్యాచ్ల్లో విఫలమైన రోహిత్ నాయకత్వ బాధ్యతలు చేపట్టే ఈ సిరీస్లోనైనా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతాడో చూడాలి.