ప్రపంచ కప్ పోటీల్లో సెమీఫైనల్కు ముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచకప్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస వివారాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. మితిమీరి అపీల్ చేసినందుకు, ఫీల్డ్ అంపైర్లతో వాగ్వివాదానికి దిగినందుకు ఆయనపై ఈ వేటు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం విరాట్ మెడపై రెండు మూడు మ్యాచ్ల నిషేధం కత్తి వేలాడుతోంది. ఇప్పటికే లీగ్ దశలో ఎనిమిది మ్యాచ్లు ఆడిన టీమిండియా.. ఆరు విజయాలతో సెమీస్ బెర్తుని ఖాయం చేసుకోగా.. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ శ్రీలంకతో శనివారం ఆడనుంది.ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా.. సెమీస్, ఫైనల్కి అతను దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది.
అసలు విషయానికి వస్తే…బంగ్లాతో జరిగిన మ్యాచ్లో 11వ ఓవరులో మొహమ్మద్ షమీ వేసిన బంతి సౌమ్య సర్కార్ ప్యాడ్స్ కు తాకింది. షమీ , ఎల్బీడబ్ల్యు అపీల్ చేశాడు. అంపైర్ మార్యాస్ ఎరాస్మస్ షమీ అపీల్ తోసి పుచ్చాడు. దాంతో కెప్టెన్ కోహ్లీ రివ్యూ కోరాడు. అయితే, బంతి ఒకేసారి ప్యాడ్ కు, బ్యాట్ కు తగిలినట్లుందని చెప్పి ఎరాస్మస్ నిర్ణయంతో థర్డ్ అంపైర్ అలీం దార్ ఏకీభవించాడు.థర్డ్ అంపైర్ బాల్ ట్రాకింగ్ స్క్రీన్ పై దృష్టి పెట్టలేదు. భారత్ దాంతో రివ్యూను కోల్పోవడమే కాకుండా ఫలితం వ్యతిరేకంగా వచ్చింది. దాంతో సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ ఎరాస్మస్ తో వాదానికి దిగాడు. దీంతో.. కోహ్లీ దూకుడుపై సెమీస్ ముంగిట టీమిండియా మేనేజ్మెంట్ ఆందోళన చెందుతోంది.
ఇటీవల అఫ్గానిస్థాన్తో ముగిసిన మ్యాచ్లో ఔట్ కోసం అప్పీల్ చేసిన విరాట్ కోహ్లీ.. ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్ని తిరస్కరించడంతో సహనం కోల్పోయి అతని మీదకి దూసుకెళ్లాడు. దీంతో.. క్రమశిక్షణ తప్పిన కోహ్లీ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించిన మ్యాచ్ రిఫరీ.. అతని ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ని కూడా చేర్చాడు.గత ఏడాది దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో ఇలానే క్రమశిక్షణ తప్పి ఒక డీమెరిట్ పాయింట్ని పొందిన కోహ్లీ ఖాతాలో ఇప్పుడు మొత్తం రెండు డీమెరిట్ పాయింట్లు ఉన్నాయి.
ఐసీసీ నింబంధనల ప్రకారం రెండేళ్ల వ్యవధిలో ఒక క్రికెటర్ ఖాతాలో డీమెరిట్ పాయింట్ల సంఖ్య నాలుగుకి చేరితే.. వెంటనే నిషేధం అమలులోకి రానుంది. రెండు డీమెరిట్ పాయింట్లు ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20లతో సమానం. దీంతో.. ఒకవేళ శ్రీలంకతో శనివారం జరిగే మ్యాచ్లో కోహ్లీ ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా.. అతని ఖాతాలో ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లు చేరే అవకాశం ఉంది.
