ఒకే ఒక్క మ్యాచ్తో టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్(డీకే) హీరో అయిపోయాడు. చివరి బంతికి అద్భుతం చేసి అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక పేజీని లిఖించుచుకున్నాడు. బంగ్లాదేశ్తో ఆదివారం ఉత్కంఠభరింతగా జరిగిన నిదహస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో అతడు బాదిన సిక్సర్ డీకే క్రీడా జీవితంలో పెద్ద మైలురాయిలా నిలిచింది. అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఆఖరి బంతికి విజయాన్ని అందించిన క్రికెటర్ల జాబితాలో అతడి పేరు చేరిపోయింది. ఈ విజయంతో భారత్తోపాటు శ్రీలంక ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు.
బంగ్లాదేశ్ ఆఖరి బంతికి విజయం వాకిట బోల్తాపడింది. గతంలోనూ ఇదే తరహా ఉత్కంఠతో సాగిన మ్యాచ్లో బంగ్లా జట్టు చివరి బంతికి ఓటమిపాలైంది. 2016లో బెంగళూరులో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 146/7కే పరిమితమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్ విజయం దిశగా సాగింది. చివరి ఓవర్లో 11 పరుగులు చేస్తే బంగ్లాదే గెలుపు.
హార్దిక్ పాండ్య విసిరిన చివరి ఓవర్ మొదటి బంతికి మహ్మదుల్లా సింగిల్ తీయగా.. రెండు, మూడు బంతులను ముస్తాఫికర్ రహీమ్ బౌండరీకి తరలించాడు. బంగ్లా విజయానికి మూడు బంతుల్లో 2 పరుగులు మాత్రమే అవసరం. ఈ దశలో భారీ షాట్లకు యత్నించిన ముస్తాఫికర్, మహ్మదుల్లా వరుస బంతుల్లో వెనుదిరిగారు. దీంతో బంగ్లా విజయానికి చివరి బంతికి 2 పరుగులు అవసరమయ్యాయి.
ఒక్క పరుగు చేస్తే మ్యాచ్ టైగా ముగిసే అవకాశం. దీంతో ధోనీ, నెహ్రా కలిసి బంతి ఎక్కడ విసరాలో పాండ్యకు సలహా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఫీల్డింగ్ సెట్ చేశారు. క్రీజ్లోకి వచ్చిన షువగట పాండ్య విసిరిన బంతిని ఆడటంలో విఫలమయ్యాడు. కానీ సింగిల్ కోసం నాన్స్ట్రైక్ ఎండ్లోని ముస్తాఫిజుర్ రహ్మాన్ వేగంగా పరిగెత్తుకొచ్చాడు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన ధోనీ బౌలర్ బంతి విసరక ముందే కుడి చేతి గ్లోవ్ తీసి సిద్ధంగా ఉన్నాడు. బంతిని అందుకోవడమే ఆలస్యం.. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి వికెట్లను గిరాటేశాడు. ధోనీ రనౌట్ చేయడతో ఒక్క పరుగు తేడాతో బంగ్లా అనూహ్యంగా ఓడగా.. భారత్ సంబరాల్లో మునిగిపోయింది. అప్పుడు ధోనీ రన్ఔట్ చేసి భారత్కు విజయాన్ని అందిస్తే ..ఇప్పుడు దినేష్ కార్తిక్ చివరి బంతిని సిక్స్గా మలచి భారత్కు మరోసారి చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు.