న్యూజిలాండ్తో ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో భారత్ మెరుగైన ప్రదర్శనును కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. న్యూజిలాండ్కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. మొదటి టీ20 లో భారత బౌలర్లను ఓ ఆట ఆడుకున్న కివీస్ ఓపెనర్ సీఫర్ట్ ఈరోజు కూడా భువీ బౌలింగ్లో అదేజోరుని కొనసాగించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇన్నింగ్స్ 3వ ఓవర్ వేసిన భువనేశ్వర్ బౌలింగ్లో వరుసగా తొలి రెండు బంతుల్ని 4, 6గా బాదిన సీఫర్ట్ (12: 12 బంతుల్లో 1×4, 1×6) మూడో బంతినీ హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ.. అనూహ్యంగా బౌన్స్ అయిన బంతి అతని బ్యాట్ ఎడ్జ్ని తాకి నేరుగా వికెట్ కీపర్ ధోనీ చేతుల్లో పడింది.
కృనాల్ పాండ్య వరుస ఓవర్లలో కొలిన్ మున్రో (12: 12 బంతుల్లో 1×6), డారిల్ మిచెల్ (1: 2 బంతుల్లో), కేన్ విలియమ్సన్ (20: 17 బంతుల్లో 3×4) వికెట్లను పడగొట్టాడు. దీంతో.. 7.5 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 50/4తో ఉన్న న్యూజిలాండ్ను గ్రాండ్ హోమ్, టైలర్ ఆదుకున్నారు. గ్రాండ్హోమ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 28 బంతుల్లో 4 సిక్స్లు, ఒక ఫోర్తో 50 పరుగులు చేసిన గ్రాండ్హోమ్ మ్యాచ్ను మలుపుతిప్పాడు. అతనికి టేలర్ (36 బంతుల్లో 42) చక్కని సహకారం అందించాడు. ఈ ఇద్దరూ కలిసి ఐదో వికెట్కు 77 పరుగులు జోడించారు. దీంతో కివీస్ చాలెంజింగ్ స్కోరు సాధించింది. భారత బౌలర్లలో కృనాల్ పాండ్యా 3, ఖలీల్ అహ్మద్ 2, భువనేశ్వర్, హార్దిక్ చెరొక వికెట్ తీశారు.