వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతోంది. మౌంట్ మాంగనూయ్లో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ మెరుగైన ప్రదర్శనను కనబరిచింది. బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్ను 49 ఓవర్లలో 243 పరుగులకే కట్టడి చేసింది. రాస్ టేలర్(93: 106 బంతుల్లో 9ఫోర్లు), టామ్ లాథమ్(51: 64 బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) అర్ధశతకాలతో రాణించడంతో కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు మహ్మద్ షమీ(3/41), భువనేశ్వర్ కుమార్(2/46), హార్డిక్ పాండ్య(2/45), చాహల్(2/51) విజృంభించారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న కివీస్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రారంభంలోనే గప్తిల్ (13)ను భువనేశ్వర్, మన్రో (7)ను షమీ, విలియమ్సన్ (28)ను చాహల్ పెవిలియన్కు చేర్చారు. దీంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఈ దశలో కివీస్ జట్టును టేలర్ (93), లాథమ్ (51) ఆదుకున్నారు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ నాలుగో వికెట్కు 119 పరుగులు జోడించడంతో న్యూజిలాండ్ గౌరవ ప్రదమైన స్కోరును సాధించింది.
న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ భారీ స్కోరు సాధించే అవకాశాన్ని జారవిడుచుకుంది. వరుస ఓవర్లలో నికోలస్ (6), సాంట్నర్ (3)లను పాండ్యా అవుట్ చేశాడు. కొద్ది సేపటికి సెంచరీకి చేరువవుతున్న టేలర్ను, ఆ వెంటనే సోదీ (12)ని షమీ అవుట్ చేశాడు. అనంతరం బ్రాస్వెల్ (15)ను కోహ్లీ రనౌట్ చేశాడు. ఇక, చివరి బ్యాట్స్మెన్గా బౌల్ట్ (2) భువీ బౌలింగ్లో అవుటయ్యాడు. దీంతో న్యూజలాండ్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది