నంబర్ 1 టెస్టు జట్టుగా దక్షిణాఫ్రికా గడ్డ మీద అడుగుపెట్టిన భారత జట్టు స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేక పోయింది. కోహ్లి మినహా మిగతా బ్యాట్స్మెన్లందరూ దారుణంగా విఫలమయ్యారు. బౌలర్లు అద్భుతంగా రానించినా బ్యాట్స్మెన్లు చేతులెత్తేశారు. విరాట్తోపాటు పుజారా మాత్రమే భారత్ తరఫున 50కి పైగా పరుగులు చేయగలిగారు.
రెండో టెస్టులో రెండుసార్లు రనౌట్ అయిన పుజారా నిరాశపరిచాడు. కానీ జొహెన్నస్ బర్గ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్లో సఫారీ బౌలర్లకు ఎదురు నిలిచిన అర్ధ శతకం సాధించాడు. తొలి పరుగు కోసం 53 బంతులు ఆడిన పుజారా దక్షిణాఫ్రికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. డిఫెన్స్లో రాహుల్ ద్రావిడ్ను తలపించాడు.
రెండో ఇన్నింగ్స్లో ఒక్క రన్కే అవుటై మళ్లీ నిరాశపరిచాడు. రాహుల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాక.. అతడి స్థానాన్ని పుజారా భర్తీ చేస్తున్నాడు. ‘నయా వాల్’గా పేరొందాడు. సొంత గడ్డ మీద ఈ పేరుకు న్యాయం చేస్తున్న పుజారా విదేశాల్లో మాత్రం అంచనాలకు అనుగుణంగా రాణించడం లేదు.
ఆసియా వెలుపల 20 టెస్టులు పూర్తయ్యాక ద్రావిడ్, పుజారా ఆటతీరును పోల్చి చూస్తే.. ఇద్దరి మధ్య బోలెడు తారతమ్యం ఉంది. ద్రావిడ్ 54.66 సగటుతో 1640 రన్స్ చేశాడు. అందులో 4 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ ఆసియా వెలుపల 20 టెస్టుల్లో పుజారా 956 రన్స్ మాత్రమే చేశాడు. అతడి 27.31 కాగా, ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు మాత్రమే సాధించాడు. ఈ తేడాను పూరించగలిగితే పుజారా నయా వాల్ కావడమే కాదు.. రానున్న రోజుల్లో కోహ్లిసేన విదేశాల్లోనూ విజయాలు సాధించగల్గుతుంది