శ్రీలంకతో ధర్మశాలలో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ వన్డేలో బ్యాట్స్మెన్లందరూ ఘోరంగా విఫలయిన సంగతి తెలిసిందే. మోహాలీలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా పుంజుకుంది. ఎవరూ ఊహించనంతగా సిరీస్లో కదం తొక్కింది. తొలి వన్డేలో ఘోరంగా విఫలమయిన కెప్టెన్ రోహిత్ శర్మ (208 నాటౌట్: 153 బంతుల్లో 13×4, 12×6) డబుల్ సెంచరీతో తొలుత ఉతికారేయగా లంక బౌలర్లలకు చుక్కలు చూపించాడు.
దీంతో మొహాలి వేదికగా బుధవారం జరిగిన రెండో వన్డేలో 141 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్ మూడు వన్డేల సిరీస్ని 1-1తో సమం చేసి.. సిరీస్ ఆశలు నిలుపుకుంది. ఇక విజేత నిర్ణయాత్మక మూడో వన్డే విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనుంది. జట్టులో రోహిత్ శర్మతో పాటు శ్రేయాస్ అయ్యర్ (88: 70 బంతుల్లో 9×4, 2×6), శిఖర్ ధావన్ (68: 67 బంతుల్లో 9×4) అర్ధశతకాలు సాధించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో టీమిండియా బౌలర్ల ధాటికి శ్రీలంక 251/8కే చేతులెత్తేసింది.
రోహిత్ శర్మ విధ్వంసంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసే సరికే మానసికంగా కుంగిపోయిన శ్రీలంక జట్టు 393 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆ జట్టులో మాజీ కెప్టెన్ మాథ్యూస్ (111 నాటౌట్: 132 బంతుల్లో 9×4, 3×6) ఒంటరి పోరాటం చేసినా.. అతనికి సహకారం అందించేవారు కరవయ్యారు.
భారత్ బౌలర్లు చాహల్ (3/60), బుమ్రా (2/43) ధాటికి ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువైంది. గుణతిలక (16), ఉపుల్ తరంగ (7), తిరుమానె (21) జట్టు స్కోరు 100 దాటే లోపే పెవిలియన్ చేరిపోగా.. డిక్విల్లా (22), కెప్టెన్ తిసార పెరీరా (5) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుని జట్టుని మరింత ఒత్తిడిలోకి నెట్టేశారు.