రాజ్ కోట్ లో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ పై భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. కేవలం రెండన్నర రోజుల్లోనే ఇన్నీంగ్స్తేడాతో ముగిసింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ఏకంగా ఇన్నింగ్స్ 272 పరుగుల భారీ తేడాతో అలవోకగా గెలుపొందింది.
తొలుత కెప్టెన్ విరాట్ కోహ్లి (139: 230 బంతుల్లో 10×4), పృథ్వీ షా (134: 154 బంతుల్లో 19×4), రవీంద్ర జడేజా (100 నాటౌట్: 132 బంతుల్లో 5×4, 5×6) సెంచరీలతో కదం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్ని 649/9 వద్ద డిక్లేర్ చేసిన భారత్ జట్టు.. అనంతరం వెస్టిండీస్ని తొలి ఇన్నింగ్స్లో 181, రెండో ఇన్నింగ్స్లో 196 పరుగులకే కుప్పకూల్చింది. దీంతో.. రెండు టెస్టుల ఈ సిరీస్లో భారత్ జట్టు 1-0తో ఆధిక్యాన్ని అందుకుంది.
విండిస్ ఆటగాళ్లలో ఒక్క పావెల్ మాత్రమే 83 పరుగుల(93 బంతుల్లో, 8 ఫోర్లు, 4 సిక్స్లు) తో భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. అతనికి సహచర ఆటగాళ్లు ఎవ్వరూ తగిన సహకారం అందించకపోవడంతో విండిస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. వికెట్లు కోల్పోతున్న నేపథ్యంలో స్కోర్ బోర్డు పెంచేందుకు యత్నించిన పావెల్ భారీ షాట్ కు యత్నించి కుల్దీప్ యాదవ్ కు దొరికిపోయాడు.