గత రెండు సీజన్లుగా భారత సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరపున ఆడిన విషయం తెలిసిందే. 2018 లో రూ.7.6 కోట్లకు పంజాబ్ అశ్విన్ ను కొనుగోలు చేసింది. వరుసగా రెండు ఏళ్ళు జట్టుకు అతను నాయకత్వం వహించాడు. అయితే ఐపీఎల్ వేలానికి ముందు అనూహ్యంగా అతను పంజాబ్ను వీడి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చేరాడు. అయితే అప్పట్లో ఈ విషయంపై పంజాబ్ యాజమాన్యం గానీ అశ్విన్ గానీ స్పందించలేదు.
ఇప్పుడు తాజాగా ఢిల్లీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అశ్విన్ ఈ విషయంపై స్పందించాడు. యంగ్ ఆటగాలతో ఉన్న ఢిల్లీ అద్భుతమైన జట్టని అశ్విన్ అన్నాడు. గతేడాడి ప్లే ఆఫ్స్ కు వచ్చిందని గుర్తు చేశాడు. రిషభ్ పంత్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్ లాంటి అద్భుతమైన ప్లేయర్స్ తో నిండిన ఢిల్లీ టైటిల్ గెలవడం కోసం తన వంతు రోల్ పోషించడం కోసం.. ఆ టీంలో చేరానని చెప్పాడు.
తన రాకతో బౌలింగ్ లో మంచి ఫలితాలు వచ్చి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే కాంక్షతోనే ఢిల్లీ టీంలో చేరానని చెప్పాడు. ఇక ఇంకోవైపు అశ్విన్ తో పాటు అజింక్య రహానే కూడా ఈ ఏడాది ఢిల్లీ జట్టులో చేరాడు. గతేడాది రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా అతను వ్యవహరించాడు. సీనియర్ల రాకతో ఢిల్లీ మరింత పటిష్టమైంది. ఇక పంజాబ్ జట్టుకు కేఎల్ రాహుల్ ఇప్పటికే కెప్టెన్గా ఎంపికయ్యాడు. రాజస్థాన్ను స్టీవ్ స్మిత్ నడిపించే అవకాశముంది. మరోవైపు కరోనా కారణంగా ఈ ఏడాది జరగాల్సిన సీజన్ వాయిదా పడిన విషయం తెలిసిందే.