భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మెరుపు ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. ఓ స్టన్నింగ్ క్యాచ్తో ఆసీస్ కీలక ఆటగాడు మాథ్యూ వేడ్ని పెవిలియన్కు పంపాడు. అశ్విన్ వేసిన 12 వ ఓవర్ ఐదో బంతిని వేడ్ షాట్ ఆడడంతో బంతి గాల్లోకి లేచింది. వెంటనే మిడాన్లో ఉన్న జడేజా క్యాచ్ అందుకోవడానికి పరిగెత్తుకొచ్చాడు. అదే సమయంలో మిడాఫ్లో ఉన్న గిల్ కూడా క్యాచ్ కోసం యత్నించాడు. జడేజా క్యాచ్ను అందుకునే క్రమంలో అతని చేయి గిల్ను తాకింది.
దీంతో క్యాచ్ మిస్సవుతుందని అంతా భావించారు. కానీ జడేజా మాత్రం బంతిని వదలకుండా ఒడిసిపట్టుకోవడంతో వేడ్ (39 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఔట్ కాక తప్పలేదు. దాంతో ఆసీస్ జట్టు స్కోర్ 35 పరుగుల వద్ద మరో ఓపెనర్ వికెట్ను కోల్పోయింది. ఇక ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. క్యాచ్ జార విడుస్తారు అనుకున్నాం.. కానీ జడేజా అద్భుతంగా ఒడిసిపట్టాడు అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ 195 పరుగులకు ఆలౌట్ అయింది.
కాగా, మహ్మద్ సిరాజ్ లబుషేన్ను అవుట్ చేయడం ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో మెయిడెన్ వికెట్ తీశాడు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఒక వికెట్ తీశాడు. అనంతరం బ్యాటింట్ చేపట్టిన టీమిండియా తొలిరోజు ఆట ముగిసే సమయానికి తన తొలి ఇన్నింగ్స్లో ఒక వికెట్కు 36 పరుగులు చేసింది. ఓపెనర్ విహారి డకౌట్ కాగా… శుభ్మన్ గిల్ (38 బంతుల్లో 28; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (23 బంతుల్లో 7, 1 ఫోర్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ కంటే టీమిండియా ప్రస్తుతం 159 పరుగులు వెనుకబడి ఉంది.