భారత్-శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య మార్చి 6 నుంచి 18 వరకు ముక్కోణపు టీ20 సిరీస్ జరగనుంది. కొలంబో వేదికగా జరిగే ఈ టోర్నీకి భారత్ ఇప్పటికే జట్టును ప్రకటించింది. సారథి విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన బీసీసీఐ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అప్పగించింది. ఇదిలా ఉండగా.. ఆతిథ్య శ్రీలంక ఆటగాళ్లు గాయాలతో సతమతమవుతున్నారు.
త్వరలో సొంతగడ్డపై జరిగే ముక్కోణపు టీ20 టోర్నీకి మాథ్యూస్ దూరం కావడంతో లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక కీలక క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ గాయం కారణంగా సిరీస్ నుంచి వైదొలిగాడు. మాథ్యూస్కు కాలిపిక్క గాయం కావడంతో అతను ట్రైసిరీస్కు దూరమవుతున్న విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్ఎల్సీ) ప్రకటించింది. ట్రై సిరీస్ నుంచి మాథ్యూస్ ఉన్నపళంగా తప్పుకోవడం నిరాశకు గురి చేసిందని లంక మేనేజ్మెంట్ పేర్కొంది.
గత నెల్లో శ్రీలంక వన్డే జట్టుకు కెప్టెన్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన మాథ్యూస్.. కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు. అయితే మాథ్యూస్కు గాయం పెద్దది కాకపోయినా, ఎస్ఎల్సీ వైద్య బృందం నుంచి క్లియరెన్స్ లభించలేదు. ఫలితంగా సిరీస్కు మాథ్యూస్ దూరం కానున్నాడు. మార్చి 6 వ తేదీ నుంచి శ్రీలంకలో ట్రై సిరీస్ ఆరంభం కానుంది.