రికార్డుల రారాజుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ ర్యాంకింగ్స్లో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో 893 పాయంట్లతో విరాట్ రెండో స్థానంలో నిలిచాడు. శ్రీలంకతో మూడో టెస్టుకు ముందు కోహ్లీ ఐదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దిల్లీలో జరిగిన టెస్టులో కోహ్లీ తొలి ఇన్నింగ్స్లో ద్విశతకంతో పాటు రెండో ఇన్నింగ్స్లో అర్ధశతకం సాధించడంతో మూడు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు రెండో స్థానంలో ఉన్న భారత ఆటగాడు పుజారా తాజా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా సారథి స్టీవ్ స్మిత్ 938 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే లంక టెస్టు జట్టు సారథి దినేశ్ చండీమాల్ తన కెరీర్లో తొలిసారి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.
భారత ఆటగాళ్లు మురళీ విజయ్(25), రోహిత్ శర్మ(40) తమ స్థానాలను మెరుగు పరుచుకున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మాత్రమే 2005-06 డిసెంబరు-జనవరి మధ్య అన్ని ఫార్మాట్లలో నంబర్వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. భవిష్యత్తులో స్మిత్-కోహ్లిలో ఎవరో ఒకరు ఈ ఘనతను అందుకునేలా కనిపిస్తున్నారు.
శ్రీలంకతో టెస్టు సిరీస్ ద్వారా బౌలర్ల జాబితాలో తిరిగి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాడని భావించిన రవీంద్ర జడేజా ఒక స్థానంలో కోల్పోయి 870 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మరో ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.