హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పరంగా కీలక చర్యలు చేపడుతున్నారు. నిజానికి ఇప్పటివరకు పార్టీ తరుపున పవన్ ఒక్కడే క్రియాశీలకంగా ఉన్నారు. ఒంటి చేత్తో పార్టీ సిద్దాంతాలను ముందుకు తీసుకెళుతున్నారు.
అయితే తాజాగా పార్టీ మీడియా హెడ్గా హరిప్రసాద్, ఇన్చార్జ్లుగా మహేందర్ రెడ్డి, వేముల శంకర్ గౌడ్లకు కీలక బాధ్యతలను అప్పగించి విస్తృమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నియామకాలు చేపట్టడం పార్టీ స్థాపించిన తర్వాత మొదటిసారి. అయితే ఇది జరగడానికి ముందు పవన్ గురించి వచ్చిన మరో వార్త ఇక్కడ కీలకం. పవన్ తన ఓటు హక్కును ఏలూరుకు మార్చుకోవడానికి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అంతే కాక ఏలూరులో తనకు ఓ ఇల్లు కూడా చూడాలని సన్నిహితులకు చెప్పినట్టు వార్తలొచ్చాయి. దీంతో పవన్ ఆంధ్రపై ఎక్కువ దృష్టి సారించేందుకే ముందుగా తెలంగాణలో నియామకాలు చేశారనేది ఓ చర్చ. అయితే నిజంగానే పవన్ ఆ ఉద్దేశంతో పశ్చిమ గోదావరిలో అడుగు పెడితే ఇక ప్రభంజనమే అనేది మరో చర్చ.
అయితే సరిగ్గా ఇక్కడే టీడీపీకి పెద్ద దెబ్బ తగలనుందా?. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండే పశ్చిమలో ఓటర్లు పవన్కు బ్రహ్మరధం పడతారు. పైగా పవన్ ఏదో ఒక సామాజిక వర్గానికే పరిమితమన్నట్టు ఎక్కడా ప్రవర్తించకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా ప్రజారాజ్యం పార్టీ పతనానికి దారి తీసిన చర్యలను ఆయన దగ్గరుండి నిశితంగా పరిశీలించారు కూడా. దీంతో అన్ని వర్గాలకు దగ్గరయ్యారు. గత ఎలక్షన్లో టీడీపీకి వెస్ట్ గోదావరిలో అన్ని సీట్లు వచ్చినట్టు ఈసారి జనసేనకు వస్తాయనేది పవన్ అభిమానుల మాట. పైగా అప్పుడు టీడీపీకి మద్దతుగా పవన్ ప్రచారం కూడా చేయడం వల్లనే అలా జరిగినట్టు అనుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే వారికి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర ఉంటుందనేది చాలా కాలం నుంచి జరుగుతున్న విషయమే. అయితే ఓ పక్క పవన్ అటు బీజేపీతో పాటు ఇటు టీడీపీతో కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో 2019లో జరుగనున్న ఎలక్షన్లో లెక్కలు ఎలా మారనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. అయితే పవన్ పశ్చిమ గోదావరిలో అడుగు పెడితే మాత్రం ప్రభంజనేమే అనే సంతోషంతో అభిమానులు సంబరాలకు సిద్దంగా ఉన్నారు.