మండుటెండలైనా.. మంచుకొండలైనా.. పరిస్థితులు ఎలా ఉన్నా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు ఆర్మీ జవాన్. దేశంలో అరాచకాలు సృష్టించే వారేవరైనా సరే నన్ను దాటుకోని పోవాల్సిందే అని రొమ్మువిరుచుకొని సరిహద్దులో నిలబడతాడు. కేవలం జీతం కోసం చేసే ఉద్యోగం కాదది. అదే నిజమైతే నీ వీరమరణానికి ఇంత మంది దుఖించరు.
ప్రమాదం ఉన్న చోటికి పరిగెత్తుకెళ్లి విధులు నిర్వర్తించావు. అందుకే అతని మరణాన్ని దేశం జీర్ణించుకోలేకపోతుంది. నీ ప్రాణత్యాగానికి బదులు తీర్చుకోవాలని గొంతెత్తుతోంది.
సెలవుపై నవ్వుతూ ఇంటికి వస్తాడనుకున్న కొడుకు మువ్వన్నెల జెండా కప్పిన ఓ శవపేటికలో ఇంటికి వస్తే ఓ తల్లి, ఓ భార్య గుండె ఎంత తల్లడిల్లుతుందో ఈ రోజు కనిపించింది. భూజాలపై ఎత్తుకొని ఆడిస్తాడనుకున్న నాన్న.. నిర్జీవంగా ఉండటం చూసి ఆ చిన్నారి మదిలో ఏం ఆలోచనలు మెదిలాయో ఊహించే సాహసం చేయలేకపోయారు.
పుల్వామాలో ముష్కరుల కుట్రకు బలైన 49 వీరజవాన్ల భౌతిక కాయాలు వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. వారి త్యాగంలో స్వార్థం లేదు.. దేశభక్తే కనిపించింది ప్రజలకు. అందుకే మీకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. వారి అంతిమయాత్ర దారుల్లో వేలాదిగా కొలువుదీరారు… ఘన నివాళులు అర్పించారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ జవాన్లకు సెల్యూట్ చేశారు.
ఈ ఘాతుకానికి పాల్పడిన వారిపై బదులు తీర్చుకోవడం ఎంత ముఖ్యమో.. అమరుడైన ఆ సిపాయి కుటుంబాన్ని ఆదుకోవడం అంతే అవసరం. కానీ ప్రభుత్వాలు సాయం చేసినా.. చేయకపోయినా.. నా కొడుకు దేశం కోసం ప్రాణత్యాగం చేశాడంటూ ఉప్పొంగిపోయే హృదయాలు ఎన్నో. నాకు ఇంకో కొడుకు ఉన్నాడు.. వాడిని సరిహద్దుకే పంపుతాను అని చెప్పే కుటుంబాలు మరెన్నో.
ఓ సైనికా నీ త్యాగం వృథా కాదు.. ఈ దేశాన్నే నీ తల్లిగా భావించి ప్రాణత్యాగం చేశావు.. నీ తల్లిని మేము ఆదుకోలేమా అంటూ మేమున్నామంటూ ఎందరో ముందుకు వస్తున్నారు.