తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని అయోషా మీరా హత్యకేసు ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. అయేషా హత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. దీనిపై కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పేర్కొంది.
ఇప్పటికే అయేషా హత్య కేసులో ఏపీ ప్రభుత్వం సిట్ ను నియమించింది. అయితే హైకోర్టు తాజాగా కేసును సీబీఐకి అప్పగించింది. సిట్ విచారణ కూడా కొనసాగుతుందని తెలిపింది. విజయవాడ కోర్టులో ఫైల్ మిస్సింగ్ వ్యవహారంపై హైకోర్టు చాలా సీరియస్ అయ్యింది. ఫైల్స్ పైన కూడా విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.
గత కొంత కాలంగా దీనిపై విచారణ కొనసాగిస్తున్న ఉన్నత న్యాయస్థానం సిట్ చేస్తున్న దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తంచేసింది. విజయవాడలో ఆయేషా మీరా హత్య జరిగిన తర్వాత ఈ కేసులో సత్యంబాబును దోషిగా తేలుస్తూ 2010లో విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే తాను నిర్దోషినంటూ సత్యంబాబు హైకోర్టులో అప్పీల్కు వెళ్లారు. ఆయన అప్పీల్పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 2016లో సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది.
2007 డిసెంబర్ 27న బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా విజయవాడలోని ఓ హాస్టల్లో హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో అప్పటి అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీలు పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నాయి. హాస్టల్ లోని బాత్రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయేషాను గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. తన ప్రేమను తిరస్కరించడంతోనే ఆయేషాను హత్య చేసినట్లు మృతదేహం పక్కన ఓ లేఖ లభ్యమయింది. ఇప్పుడు ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయనుంది.