కరోనా కారణంగా గత ఆరు నెలలుగా హైదరాబాద్ నగరంలో నిలిచిపోయిన సిటీ బస్సులు ఈ రోజు రోడ్డెక్కాయి. కోవిడ్ మహమ్మారి కారణమా అని 185 రోజులుగా స్తంభించిపోయిన సిటీ బస్సులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. బస్సు సౌకర్యం లేక ఎంతో మంది తమ దైనందిన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధిక ధరలు చెల్లించి తమ ప్రయాణాలు కొనసాగించారు. ఇక సిటీ బస్సులు రోడ్డెక్కడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ పూర్తి శానిటైజర్ చేసి ప్రయాణీకులకు భద్రత విషయంలో పూర్తి అవగాహన ఏర్పాటు చేయబోతున్నారు.
మొత్తం సిటీ బస్సులు 3200 ఉండగా, 25 శాతం బస్సులు గ్రేటర్లో తిరుగుతాయి. రాణిగంజ్ డిపోలో 225 సిటీ బస్సులు ఉండగా, వాటిలో25శాతం అంటే 55 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి. తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు అన్ని బస్సులను శానిటేషన్ చేసి భౌతిక దూరం పాటిస్తూ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. పరిస్థితులు సానుకూలంగా ఉంటే మరో వారం, పది రోజుల తర్వాతి నుంచి 50 శాతం బస్సులను అనుమతించనున్నట్టు తెలుస్తోంది.
కాగా, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా నేటి నుంచే బస్సులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మధ్య బస్సు సర్వీసుల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇక పటాన్చెరు–చార్మినార్, పటాన్చెరు–హయత్నగర్, ఉప్పల్–లింగంపల్లి, గచ్చిబౌలి–దిల్సుఖ్నగర్తోపాటు చార్మినార్, జూపార్కు, ఎల్బీనగర్, చింతల్, బీహెచ్ఈఎల్, కూకట్పల్లి తదితర ప్రాంతాలకు ఎక్కువ సర్వీసులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.
తెలంగాణలో కరోనా జోరు.. కొత్తగా 2,176 కరోనా కేసులు!
భారత్లో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 86,052 పాజిటివ్ కేసులు