ఢిల్లీలో జరిగిన జీఎస్టీ 28వ మండలి సమావేశం ముగిసింది. కొన్ని వస్తువులపై పన్ను శాతం తగ్గిస్తూ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రూ.1000 కంటే ఎక్కువ ధర ఉన్న చెప్పులపై వసూలు చేస్తున్న పన్నును 5శాతానికి తీసుకొచ్చారు. రాళ్లు, మార్బుల్స్, రాఖీ, రాతితో తయారు చేసే దేవతల విగ్రహాలను విధిస్తున్న జీఎస్టీని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జీఎస్టీ పరిధి నుంచి శానిటరీ న్యాప్కిన్లను తొలగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు శానిటరీ న్యాప్కిన్లపై 12శాతం జీఎస్టీని వసూలు చేశారు.
సెల్ ఫోన్ బ్యాటరీలు, వాక్యూమ్ క్లీనర్లు, గ్రైండర్లు, మిక్సీలు, వాషింగ్ మిషన్లు, రంగులు, వార్నిష్ లపై పన్ను శాతాన్ని 28 నుంచి 18కి తగ్గించారు. వాటర్ హీటర్లు, కూలర్లు, హెడ్ డ్రైయర్లు, హ్యాండ్ డ్రైయర్లపై పన్నును 18 శాతానికి తగ్గించారు. రూ. 5 కోట్ల లోపు టర్నోవర్ చేసే వ్యాపారులకు త్రైమాసిక జీఎస్టీ రిటర్న్స్ నుంచి మినహాయింపు నిచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లోని చిన్న వ్యాపారులకు జీఎస్టీ నుంచి ఊరట లభించింది.
ఇక హ్యాండ్బ్యాగ్స్, జ్యువెలరీ బాక్స్, అద్దాలు, హ్యాండ్మేడ్ ల్యాంప్స్తో పాటు ఇతర వస్తువులను 12శాతం పన్ను శ్లాబు పరిధిలోకి తీసుకొచ్చారు. దిగుమతి చేసుకునే యూరియాపై వసూలు చేస్తున్న జీఎస్టీని 5శాతం తగ్గించారు.
18శాతం పన్ను పరిధిలో ఉన్న ఇథనాయిల్ను 5శాతం పన్ను శ్లాబులోకి చేర్చారు. ప్రత్యేక అవసరాల కోసం కొనుగోలు చేసే వాహనాలు, వర్క్ ట్రక్స్ను 18శాతం పన్ను శ్లాబులోకి తీసుకొచ్చారు. తగ్గించిన పన్ను ధరలు జూలై 27 నుంచి అమల్లోకి రానున్నాయి.