కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తుఫాన్ వాహనాన్ని లారీ అతివేగంతో ఢీకొట్టడంతో ముగ్గురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడిక్కడే మృతి చెందారు. మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారంతా కాంగ్రెస్ నేత కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అనుచరులే.
కోడుమూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జిగా ఉన్న హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరుతున్నానని రెండు రోజుల క్రితం ప్రకటించారు. జగన్ సమక్షంలో వైసీపీలో చేరేందుకు అనుచరులతో కలసి కడపకు బయలు దేరారు. కోడుమూరు నుంచి హర్షవర్ధన్ రెడ్డి కడపకు గురువారం ఉదయం బయలుదేరిన అనతరం ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్లోని ఓ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ముగ్గురు కార్యకర్తలు బలవన్మరణం చెందారు.
ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా, వారిని వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.