తూర్పుగోదావరి జిల్లా ప్రజలను చిరుత వణికిస్తోంది. పలువురిపై దాడి చేయడంతో అక్కడి ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు. పది రోజుల కిందట ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో స్థానికులపై చిరుత దాడికి దిగింది. దాడి అనంతరం కొబ్బరి చెట్టు ఎక్కిన చిరుత ఆ రోజు అర్ధరాత్రి సమయంలో కిందికి దూకి పారిపోయింది. ప్రజలు, అటవీ అధికారులు ఎంత వెతికినా చిరుత ఆచూకి తెలియలేదు. తాజాగా ముమ్మిడివరం మండలంలో చిరుత ప్రత్యక్ష మయ్యింది. ముమ్మిడివరం మండలం ఠాణేలంక పంచాయతీ పరిధిలోని బలుసుల్లంకలో గురువారం (ఫిబ్రవరి 14) ఉదయం బహిర్భూమికి వెళ్లిన ముగ్గురు వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. చిరుత దాడిలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
దాడి అనంతరం చిరుత దగ్గరలో ఉన్న అరటి తోటలో ఉన్న ఓ ఇంట్లోకి చిరుత వెళ్లిపోయిందని స్థానికులు తెలిపారు. గ్రామస్థులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు ఆఇంటిచుట్టూ వలన అమర్చి దాన్ని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.