గుజరాత్ లోని హిమ్మత్ నగర్ లో ఓ యువకుడి వివాహం అంగరంభ వైభవంగా జరిగింది. పెళ్లికి ముందు మెహందీ వేడుకను, సంగీత్ ఉత్సవాన్నీ ఘనంగా నిర్వహించారు. గుజరాతీ పాటలకు 200 మంది యువకులు స్టెప్పులేసి అదరగొట్టారు. పెళ్లి వేడుకు అన్నాక జరిగేది ఇదే కదా అనుకుంటున్నారా….! అని ఆశ్చర్యపోకండి. ఈ పెళ్లి మాత్రం స్పెషల్. ఎందుకంటే పెళ్లిలో పెళ్లి కూతురు ఎక్కడా కనిపించలేదు. కాని పెళ్లి కుమార్తె లేకుండానే ఈ వివాహ వేడుక, సంబరాలు ఘనంగా జరిగాయి. దీని వెనుక ఓ విషాద గాథ, ఓ గొప్ప తండ్రి మనసు ఉంది.
వివరాల్లోకి వెల్తే…హిమ్మత్ నగర్ కు చెందిన అజయ్ బారోత్(27) మనో వైకల్యంతో బాధపడుతున్నాడు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో …సంజయ్ తండ్రి విష్ణు బారోత్.. అన్నీ తానై తన కొడుకును పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు అజయ్ వయసు 27 ఏళ్లు. అందరిలాగే తనకు పెళ్ళి చేయమని తండ్రిని అడిగాడు. పిల్లను ఎవరిస్తారు. అయినా తండ్రి కుంగిపోలేదు. కొడుకు కోరికను తీర్చి తన ప్రేమను చాటుకున్నాడు.
అజయ్ అడిగిన ప్రశ్నను అతడి తండ్రి మాత్రం అంత తేలిగ్గా తీసుకోలేదు. తన కుమారుడి కోరిక తీర్చాలనుకున్నారు. దగ్గరి బంధువులతో చర్చించి పెళ్లి వేడుకకు ఏర్పాట్లు చేయించారు. అంగరంగ వైభవంగా గుజరాతీ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. 800 మందికి పసందైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. బంగారపు వర్ణం షేర్వాణీ ధరించిన అజయ్.. బరాత్లో మెరిసిపోయాడు. ఇంత చేసినా.. అది పెళ్లి మాత్రం కాదు.. పెళ్లి వేడుక మాత్రమే. అసలు విషయం తెలిసిన తర్వాత స్థానికులు ఆ తండ్రిని కొనియాడారు.