పవన్ కళ్యాణ్ అనూహ్యంగా అమరావతిలో పర్యటించడంపై వైసీపీ నిప్పులు కురిపించింది. ఉన్నట్టుండి జనసేనాని పవన్ కు రాజధాని రైతులు గుర్తుకురావడం.. ఆయన రాజధానికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను తెలుసుకుంటుండడంపై తాజాగా సీఆర్డీఏ చైర్మన్, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
గతంలో రాజధాని కోసం భూసేకరణ చేస్తే ఆందోళన చేస్తానని బాబుకు వ్యతిరేకంగా రైతులను కలిసిన పవన్ కళ్యాన్.. తాజాగా రాజధాని రైతుల కోసం పోరాటం చేస్తాననడం కల్లొబొల్లి కబుర్లు చెప్పడమేనని ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ అందినప్పుడు ఒక విధంగా.. అందనప్పుడు మరో విధంగా మాట్లాడడం పవన్ కు అలవాటు అయ్యిందని విమర్శలు గుప్పించారు.
పవన్ కళ్యాణ్ కనుక చంద్రబాబు ప్యాకేజీ స్టార్ కాకూడదంటే వెంటనే చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను బయటపెట్టాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. చంద్రబాబుపైన పోరాటం చేయలేని పవన్.. ఇప్పుడు జగన్ పై పోరాటానికి సిద్ధమయ్యాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు రాజధానికి భూములు సేకరిస్తే ఆమరణ దీక్ష చేస్తానన్న పవన్ అప్పుడు ఎందుకు చేయలేదో సమాధానం చెప్పాలని ఆళ్ల డిమాండ్ చేశారు. రాజధానిపై పవన్ కు ప్రేమ ఉంటే మంగళగిరి నుంచి పవన్ ఎందుకు పోటీచేయించలేదని, ప్రచారం చేయలేదని ప్రశ్నించారు. వీటన్నింటి పరిణామాలతో పవన్ ఖచ్చితంగా చంద్రబాబు ప్యాకేజీ స్టార్ అని ఆళ్ల విమర్శలు గుప్పించారు.