దళితులకు రాజకీయాలు ఎందుకు? అంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపాయి. దళితులను అవమానపరిచేలా ప్రవర్తించిన చింతమనేనిపై చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు… సరికదా ఏకంగా సీఎం చంద్రబాబే ఆయనను వెనకేసుకొచ్చారు. చింతమనేని వ్యాఖ్యలను వక్రీకరించారంటూ చెప్పుకొచ్చారు. అవునులేండి ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా? అని ప్రశ్నించిన చంద్రబాబు నుంచి ఇంతకంటే ఎక్కవ ఏం ఆశించలేమని ప్రజలకు అర్థమయ్యింది.
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు.. చింతమనేనిని… చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ కూడా వెనకేసుకొచ్చారు. మా తండ్రే వెనకేసుకొచ్చారు.. తాను ఏం తక్కువ తిన్నాను అన్నట్టు ఏకంగా ఓ ట్వీట్ చేశారు. అందులో జగన్ మీడియా చింతమనేని వ్యాక్యలను వక్రీకరించిందన్నారు. కావాల్సినంత వరకే ఎడిట్ చేసి దళితులను రెచ్చగొట్టిందన్నారు. అంతేనా అసలు వీడియో ఇది అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
అయ్యే చింతమనేనిని అందరూ అపార్థం చేసుకున్నారు. ఆయనకు దళితులంటే అమితమైన ప్రేమ.. కానీ జగన్ మీడియానే ఆయన వ్యాఖ్యలను వక్రీకరించింది. అసలు వీడియో చూస్తే మొత్తం క్లారిటీ వస్తుందని చూస్తే మళ్లీ షాక్ తగిలింది. ఆ మొత్తం వీడియో చూశాక చింతమనేనికి దళితులంటే కేవలం ఓట్ల వరకే తప్ప వారి అభివృద్ధి పట్టదన్న విషయం క్లారిటీ వచ్చింది.
మీకేందుకురా రాజకీయాలు.. ఆ కోట్లాటలు మీకేందుకురా? కడుపు తీపితో మీ కుటుంబాలను బాగుండేలా చూస్తారు తప్ప.. మీకేందుకురా రాజకీయాలు.. ఏనాడైనా మీ పనులు మానుకొని నా వెనుక తిప్పుకున్నానా? పార్టీ ఆదేశించినప్పుడు తప్ప.. అంటూ ఇలా సాగింది చింతమనేని ప్రసంగం. ఇందులో ఎక్కడా కూడా చింతమనేని దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని గానీ.. మీ కోసం పనిచేస్తానని గానీ చెప్పిన దాఖలాలు లేవు. ఇంకా మీ కుటుంబాల బాగా చూసుకొండి.. కొట్లాటలు ఎందుకుంటూ ఏదో బెదిరిస్తున్నట్టే ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు.
ఈ వీడియోను పోస్ట్ చేసి చింతమనేనికి, టీడీపీకి దళితులపై ఎంత ప్రేమ ఉందో మరింత క్లారిటీ ఇచ్చారు నారా లోకేష్. అసలు జగన్ మీడియా కూడా మొత్తం వీడియోను చూపించినా పోయేది. అందులో పెద్ద నష్టం ఏం ఉండేది కాదు.
జగన్ – మోడీ కుల రాజకీయం: చింతమనేని ప్రసంగాన్ని కావలసినంత వరకే ఎడిట్ చేసి దళితులను అవమానించారంటూ జగన్ తన మీడియా ద్వారా దళితులను రెచ్చగొడుతున్నారు. pic.twitter.com/lp6FWbFh1s— Lokesh Nara (@naralokesh) February 21, 2019