గెలిచే దారి కనిపెట్టు. లేకపోతే ఓటర్లను తికమక పెట్టు అంటున్నాయి కొన్నిరాజకీయ పార్టీలు. మొన్నటి తెలంగాణా ఎన్నికల్లో కారును పోలినట్టు ఉన్న ట్రక్ గుర్తుకు మా ఓట్లన్నీ పడ్డాయని కేసీఆర్ విమర్శించారు. సిమిలర్ గా ఉన్న గుర్తువల్లే ఈ సమస్య వచ్చిందని నిపుణులు అన్నారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లోనూ అలాంటి సందర్భమే వచ్చింది. అయితే ఇది కావాలని జరిగిన కుట్ర అంటున్నాయి ఇతర పార్టీలు.
తికమకల తంత్రం
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పోటీ పక్షాలుగా వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన ఉండగా ప్రజాశాంతి పార్టీ కూడా నేనున్నానంటూ ముందుకొచ్చింది. అయితే జనసేన, ప్రజాశాంతి పార్టీలు చంద్రబాబు గెలుపు కోసం, ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు చీల్చడం కోసం పనిచేస్తున్న కోవర్టులని బహిరంగంగానే విమర్శ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ టీడీపీ అభ్యర్థులకు అనుకూలంగా తన అభ్యర్థులను ప్రకటించడం, పాల్ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల పేరుతో ఉన్నవారినే చాలా చోట్ల నిలబెట్టడం వంటివి చూస్తే ఆ విమర్శల్లో వాస్తవం ఉందని ప్రజలూ భావిస్తున్నారు. అయితే కొద్ది రోజుల నుంచీ హడావిడి చేస్తున్న కే.ఏ పాల్ ప్రజాశాంతిపార్టీ మరో అడుగు ముందుకేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లాంటి గుర్తు, కండువ, చివరకు అభ్యర్థులనూ ఒకే పేరుతో ఉండేలా చూడటం పెద్ద దుమారం లేపుతోంది. సుమారు పదిహేను నియోజకవర్గాల్లో కే.ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ అభ్యర్థుల పేర్లు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లూ దాదాపుగా ఒకటిగానే ఉన్నాయి. ఓటర్లను ఈవీఎమ్ మిషీన్ల దగ్గర తికమక పెట్టేందుకే ఈ పన్నాగం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇలాంటి జిత్తుల మారి తెలివి తేటలు చంద్రబాబువి తప్ప మరొకరివి కావని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ ఫ్యాన్ గుర్తును పోలి ఉండేలా హెలికాఫ్టర్ గుర్తును పెట్టుకోవడం, కండువాలను కూడా వైసీపీ మాదిరిగానే ఉపయోగించడం వెనుక అర్థం ఓటర్లను గందరగోళ పెట్టి ఫ్యాన్ గుర్తుకు పడే ఓట్లను చీల్చడమే అంటున్నాయి. అయితే ఇదే పద్ధతిలో ప్రజాశాంతి పార్టీ చీల్చానుకుంటున్న క్రైస్తవ ఓట్లు కూడా ఈ గందరగోళంలో వైసీపీకి పడే అవకాశమూ లేకపోలేదు.
ఓటర్లేం చేయాలి??
ఎన్నికలు అతి సమీపంలో ఉన్న నేపథ్యంలో ఓటర్లను మరీ ఎక్కువ గందరగోళంలో పడేయకుండా పార్టీ గుర్తుల్లోని తేడాలను వారికి చేరవేయడం పార్టీల పని అయితే, తమకు నచ్చిన పార్టీకి చెందిన అభ్యర్థులు ఎవరో వారి ముఖాన్ని ఈవీఎమ్ మిషన్ లో గుర్తించి ఓటు వేయడం ఓటర్లు చేయాల్సిన పని. ఈవీఎమ్ మెషీన్ లో పార్టీ గుర్తు పక్కన అభ్యర్థి ఫొటో కూడా ఉంటుంది. కనుక ఒకటి రెండుసార్లు సరిచూసుకునే ఎంచుకుని ఓటేయడం మంచిది అంటున్నారు విశ్లేషకులు.