ఎన్నికల షెడ్యూల్ విడదుల అవడంతో సమరానికి అన్ని పార్టీ పూర్తి స్థాయిలో సిద్దమవతున్నాయి. టీడీపీ, జనసేన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఇక వైసీపీ అభ్యర్థులను ప్రకటించనున్న తరుణంలో వివేకానందరెడ్డి హత్య ఆ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివేకానందరెడ్డి హత్యతో అభర్ధుల జాబితా వాయిదా పడుతుందని అందరు అనుకున్నారు. కాక పోతే జగన్ మాత్రం వెనక్కితగ్గే రకం కాదు. అంత్యక్రియల కార్యక్రమం పూర్తవగానే… ఎన్నికల రణరంగంలోకి దిగారు. శనివారం సాయంత్రం అభ్యర్థుల జాబితా విడుదలకు ముహుర్తం ఫిక్స్ చేశారు.
అయితే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా పూర్తి అయినా ఎంపీ జాబితా పూర్తి జాబితా కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం టీడీపీకీ గట్టిపోటీ ఇచ్చే అభ్యర్థులకోసం జగన్ వేచిచూస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో చేరేందుకు బలమైన నేతలు రెడీగా ఉన్నారు. వైసీపీలో చేరే వారిలో అనకాపల్లి, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు ఎంపీ అభ్యర్థులుగా ప్రచారంలో ఉన్న కొణతాల రామకృష్ణ, ఆదాల ప్రభాకర్ రెడ్డి, బుట్టా రేణుక, మాజీ ఎంపీ వంగా గీత ఉన్నారు. అయితే వీరు ఈ పాటికే వైసీపీలో చేరాలి కాని వివేకానందరెడ్డి హత్యతో చేరికలు ఆగిపోయాయి.
వీరితో పాటు ఇంకా కొంత మంది వైసీపీలో చేరాక… అభ్యర్థుల జాబితాను పూర్తి చేసి శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఎంపీ స్థానాలకు జగన్ అభ్యర్ధుల ఎంపిక చేపట్టాల్సి ఉంది. ఇందుకోసం శనివారం కొందరు ఎంపీ ఆశావహులను జగన్ వైసీపీకి ఆహ్వానించనున్నారు. వీరిలో ప్రధానంగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొణతాల, ఈ మధ్యనే టీడీపీకి గుడ్ బై చెప్పిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, టీడీపీ తరఫున ఇప్పటికే నెల్లూరు రూరల్ టికెట్ అందుకున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మాజీ ఎంపీ వంగా గీత మరో వైపు టీడీపీలోకి ఫిరాయించి చేదుఅనుభవం ఎదుర్కొన్న బుట్టా రేణుక వంటి వారున్నారు.
కొణతాల రామకృష్ణను విశాఖ జిల్లా అనకాపల్లి నుంచీ, మాగుంట శ్రీనివాసులరెడ్డిని ఒంగోలు నుంచీ, ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు నుంచీ, బుట్టా రేణుకను కర్నూలు నుంచీ బరిలోకి దింపేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. వీళ్లతో పాటూ పార్టీలో చేరనున్న మాజీ ఎంపీ వంగా గీతకు తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టికెట్ ఇచ్చే అవకాశముంది. అయితే వీరందరు పార్టీలో చేరితే జాబితాపై ఒక స్పష్టమైన నిర్ణయం రానుంది. అనంతరం పూర్తి ఎమ్మెల్యే, ఎంపీల అభ్యర్థుల జాబితాను ప్రకటించి వెంటనే ఎన్నికల ప్రచారంలోకి దిగనున్నారు జగన్.