టీడీపీ నేత వర్ల రామయ్య సిఎం వైఎస్ జగన్ ‘ఫ్రైడే’ చీఫ్ మినిస్టర్ ని నియమించాలి అంటు… ఎద్దేవా చేశారు. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు వెళ్లాల్సి ఉంది. ప్రతి శుక్రవారం తప్పకుండా వెళ్లండి వాయిదా వేయకండి. అవసరమైతే వారానికి రెండుసార్లు వెళ్లండి కడిగిన ముత్యంలా, బయటకు వస్తానని, తనపై వచ్చినవన్నీ ఆరోపణలు మాత్రమేనని దమ్ముంటే జగన్ నిరూపించుకోవాలి’ అని సవాలు విసిరారు.
‘మరీ ఇన్నేళ్లపాటు విచారణ కొనసాగితే ఎలా? న్యాయస్థానానికి జగన్ సహకరించాలి. ఏదో వంకతో, అధికారం, అంగబలం ఉందన గర్వంతో, విచారణను వాయిదా వేయొద్దు. ఇప్పటికైనా కోర్టులో విచారణ వేగంగా జరగాలి. తనపై ఉన్న మచ్చను జగన్ తుడిపేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రిపై ఇన్ని కేసులుండడం సరికాదు. ఆయన నిర్దోషిగా బయటకు రావాలని నేనూ కోరుకుంటున్నాను. ఇందుకోసం త్వరితగతిన విచారణ జరగాలి’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.
‘ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులోనే ఉంటానని, విచారణ వేగవంతం చేయాలని జగన్ కోరాలి. అంతేగానీ, వంకలు చెబుతూ కోర్టు విచారణకు తప్పించుకోవడం సరికాదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ను జగతి పబ్లికేషన్ కు చెందిన ఓ పత్రికలో 834 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. పత్రికా రంగంలో ప్రపంచంలోనే ఒక పారిశ్రామిక వేత్త ఇంత భారీ పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు’ అని వర్ల రామయ్య ఆరోపించారు.
‘నేను చెప్పింది అసత్యమని నిరూపిస్తే మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. పత్రికా రంగంతో సంబంధం లేని వ్యక్తి భారీ పెట్టుబడులు ఎందుకు పెట్టారు? ఆ పత్రిక ఆయనది కాదు.. ఆయన కుటుంబ సభ్యులది కాదు.. పత్రికా రంగం లాభసాటి వ్యాపారం కూడా కాదు.. మరి ఆయన ఇందులో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు?’ అని వర్ల రామయ్య ప్రశ్నించారు.