గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఓ వివాదంలో చిక్కుకున్నారు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామానికి చెందిన మేకల రవీంద్ర అనే వైసీపీ కార్యకర్త ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉండవల్లి శ్రీదేవి తనకు రూ.1.40 కోట్లు ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కలకలం రేపుతోంది.
ఎన్నికల సమయంలో ఉండవల్లి శ్రీదేవి తనను డబ్బు కావాలని అడిగితే ఇచ్చానని రవి వెల్లడించారు. తన భర్త మోసం చేశాడని తనతో చెప్పుకుని ఉండవల్లి శ్రీదేవి వాపోయిందని, ఆమె కన్నీరు పెట్టుకోవడంతో చూడలేక తనకు తెలిసిన వాళ్ల వద్ద డబ్బు తీసుకుని ఆమెకు ఇచ్చానని రవి వివరించారు.
ఇచ్చిన డబ్బు మొత్తం తిరిగి ఇవ్వమని అడిగితే ఇప్పటివరకు ఆమె ఇచ్చింది రూ.60 లక్షలు మాత్రమేనని అన్నారు. ఇంకా రూ.80 లక్షలు ఇవ్వాల్సి ఉండగా, బ్యాలెన్స్ ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారని మేకల రవి తెలిపారు. ఈ విషయంలో తనకు సీఎం జగన్ న్యాయం చేయాలని, లేకపోతే రాజధాని ప్రాంతంలో జరిగే మొదటి వైసీపీ కార్యకర్త ఆత్మహత్య తనదే అవుతుందని స్పష్టం చేశారు. రవి మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.