ప్రపంచకప్లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమితో టీమిండియాలో కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలు ఉన్న వార్తలు ఇటీవలె తెరమీద ప్రత్యక్షమయ్యాయి. డ్రస్సింగ్ రూమ్ లో గొడవలు జరుగుతున్నాయని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరో వైపు విండీస్ పర్యటనకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవాలని కోహ్లి భావించాడని.. కానీ రోహిత్కి కెప్టెన్సీని అప్పగించడం ఇష్టం లేకే మళ్లీ మనసు మార్చుకున్నాడని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ విబేధాలను బీసీసీఐ ఖండించింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. కోహ్లి, రోహిత్ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయనేది నిజమేననిపిస్తోంది.
అప్పుడెప్పుడో విరాట్ కోహ్లీని ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిన రోహిత్, ఇప్పుడు ఆయన భార్య అనుష్క శర్మను కూడా అన్ ఫాలో అయ్యాడు. ఇదే ఇద్దరి మద్య ఉన్న విబేధాలకు ఆజ్యం పోసింది. ఇక ఇదే సమయంలో అనుష్క శర్మ రోహిత్, అతని భార్య రితికల ఖాతాలను ఫాలో కావడం ఆపేసింది. తనను, తన భర్తను ఫాలో కాని వ్యక్తులను తానెందుకు ఫాలో కావాలని అనుష్క భావించినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని దగ్గరి నుంచి చూస్తున్న సోషల్ మీడియా, కోహ్లీ, రోహిత్ ల మధ్య గొడవలు చాలా ఎక్కువగానే ఉన్నాయని కామెంట్ చేస్తున్నారు.
బ్రిటన్ లో జరిగిన వరల్డ్ కప్ పోటీల్లో సెమీస్ ముందు వరకూ ఈ ఇద్దరి మధ్యా సఖ్యత ఉన్నట్టు కనిపించినా, సెమీస్ లో ఓటమి తరువాత విబేధాలు బయటకు వచ్చాయి. ఇద్దరి మధ్య విబేధాలు కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయినట్లు సమాచారం. ఇద్దరి మధ్య ఉన్న విబేధాలు జట్టుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని మేనేజ్ మెంట్ ఆందోళన చెందుతోంది.