ప్రపంచకప్లో తీవ్ర చర్చకు తావిస్తున్న జింగ్ బెయిల్స్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్పష్టతనిచ్చింది. టోర్నీ మధ్యలో వాటిని మార్చడం కుదరదని తేల్చి చెప్పింది. అన్ని జట్లూ వాటినె ఉపయోగించాలని తెలిపింది.గత వరల్డ్కప్ నుంచి అన్ని అంతర్జాతీయ మ్యాచ్ల్లో ఇవే బెయిల్స్ వినియోగిస్తున్నాం. అప్పుడు లేని సమస్య ఇప్పుడే ఎందుకు తలెత్తుతున్నది. అదంతా ఆటలో భాగమే. టోర్నమెంట్ మధ్యలో మార్పులు చేయం. అన్ని జట్లు అదే సరంజామతో ఆడుతున్నాయి అని ఐసీసీ మంగళవారం తెలిపింది.
ఐపీఎల్, ప్రపంచకప్ టోర్నీల్లో గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చె బంతులు తాకినా బెయిల్స్ కిందపడకపోవడం పలు అనుమానాలకు దారి తీసింది. ఇలా బెయిల్స్ కిందపడకపోవడంతో కీలక బ్యాట్స్మెన్ బతికిపోవడం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతుందనడంలో సందేహంలేదు.
భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఓపెనర్ డెవిడ్ వార్నర్ ఇలానే బతికిపోయాడు. బుమ్రావేసిన రెండో ఓవర్లో అతను డిఫెన్స్ చేయబోగా.. ఆ బంతి నేరుగా వికెట్లకు తగిలింది. కానీ బెయిల్స్ కిందపడక లైఫ్ వచ్చింది. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
మ్యాచ్ అనంతరం ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేశారు.సాధారణ బెయిల్స్ కంటే జింగ్ బెయిల్స్ మూడింతల బరువు ఉండటం వల్లే అవి కింద పడటం లేదని, వెంటనే వాటిని మార్చేయాలని కోహ్లి, ఫించ్లతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్, అభిమానులు ఐసీసీని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐసీసీ స్పందిస్తూ.. మెగా ఈవెంట్ మధ్యలో మార్చడం కుదరదని స్పష్టం చేసింది.