ఇంగ్లండ్తో జరుగుతున్న ఆఖరి టెస్టులో ఆధిపత్యం అటూ ఇటూ ఊగిసలాడుతూ ఇరుజట్లనూ ఊరిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకే 7 కీలక వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ చివరిలో రాణించి గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన భారత్ 174 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. స్కోరు 200 దాటడమే కష్టమనుకునే సమయంలో క్రీజ్లో అతుక్కుపోయిన ఆల్రౌండర్ జడేజా, తొలిటెస్టు ఆడుతున్న తెలుగు కుర్రాడు విహారిలు ఇంగ్లండ్ బౌర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ఏడో వికెట్కు జడేజా, విహారీలు 77 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ పై పట్టుకోల్పోకుండా కాపాడారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 292 పరుగులు సాధించి విజయావకాశాలపై ఆశలు సజీవంగా ఉంచుకొంది.
ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (86 నాటౌట్: 156 బంతుల్లో 11×4, 1×6), అరంగేట్రం బ్యాట్స్మెన్ హనుమ విహారి (56: 124 బంతుల్లో 7×4, 1×6) అర్ధశతకాలు బాదడంతో ఆటలో మూడో రోజైన ఆదివారం ఓవర్నైట్ స్కోరు 174/6తో తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత జట్టు కనీసం ఈ మాత్రమైనా పోరాడగలిగింది.
ఈరోజు తొలి సెషన్లో హనుమ విహారి, జడేజా జోడీ సహనంతో ఇంగ్లాండ్ బౌలర్లని ఎదుర్కొని కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో 104 బంతుల్లో కెరీర్లో తొలి అర్ధశతకాన్ని నమోదు చేసుకున్న విహారి.. జట్టు స్కోరు 237 వద్ద ఔటవగా.. అనంతరం వచ్చిన ఇషాంత్ శర్మ (4), మహ్మద్ షమీ (1), జస్ప్రీత్ బుమ్రా (0)తో కలిసి జడేజా దూకుడుగా ఆడాడు. స్పిన్నర్లను సహనంతో ఎదుర్కొంటూనే పేసర్లపై జడేజా భారీ షాట్లతో ఎదురుదాడికి దిగాడు. అదే జోరులో అతను శతకం సాధించేలా కనిపించినా.. జట్టు స్కోరు 292 వద్ద లేని పరుగు కోసం ప్రయత్నించి బుమ్రా రనౌటవడంతో భారత్ పోరాటానికి తెరపడింది.