ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఇంద్రికీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కలకలం రేగింది. అమ్మవారి సన్నిధిలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇంద్రకీలాద్రిపై ఇప్పటి వరకు విజిలెన్స్, ఏసీబీ సోదాలు నిర్వహించినా, ఇంత సుదీర్ఘంగా ఎన్నడూ జరగలేదని దుర్గగుడి వర్గాలు చెబుతున్నాయి. గురువారం ప్రారంభమైన సోదాలు శుక్రవారం రాత్రి కూడా కొనసాగాయి. శనివారం కూడా కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.
ప్రొవిజన్స్ స్టోర్, కేశఖండన, ప్రసాదం, సాధారణ పరిపాలన, చీరల విభాగంలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్టు ఆరోపణలున్నాయి. అంతర్గత బదిలీల విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఆరా తీశారు. స్క్రాప్ విక్రయం వివరాలపైనా దృష్టి సారించిన అనిశా బృందం.. కోట్ల విలువ చేసే స్క్రాప్ను రూ.లక్షల్లో విక్రయించినట్లు పరిశీలనలో తేలినట్లు సమాచారం.
ఫెర్రీలో తుక్కు విక్రయాల సొమ్ము ఏ ఖాతాలో జమ చేశారనే అంశాలపై ఆరా తీశారు. ముడుపులను రుచి మరిగిన అధికారులు తమ వర్గంలో ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారన్న దానిపైనా రికార్డులు నిర్వహించుకున్నట్టు సమాచారం. ఇలాంటి పుస్తకమే ఒకటి ఏసీబీ అధికారులకు లభించినట్టు తెలుస్తోంది. రెండురోజుల తనిఖీల్లో సిబ్బంది నుంచి వివరాలు నమోదు చేయగా… ఈ సోదాలకు సంబంధించిన వివరాలు కొలిక్కిరాలేదు.
రోజర్ పే పేరు విన్నారా.. రుణ యాప్ల కేసులో ఈడీ ఎంట్రీ..!