కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడయ్యాక తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించగానే కాంగ్రెస్ లోని ఓ వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. ఓ వైపు సీనియర్ కాంగ్రెస్ నేత కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి పార్టీకీ రాజీనామా చేయబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్కు ఏ పదవులు దక్కకపోవడంతో వాళ్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్ పలు విషయాలపై మాట్లాడారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలందరినీ తాను కలుపుకొని పోతానని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తమ్ కుమార్రెడ్డి, జానారెడ్డి వంటి సీనియర్లలతో మాట్లాడానని చెప్పారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ తన కుటుంబసభ్యులని రేవంత్ పేర్కొన్నారు. తనకు మల్కాజ్గిరి టికెట్ ఇప్పించిందే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అని పేర్కొన్నారు.
ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. ప్రస్తుతం కోమటి రెడ్డి బ్రదర్స్ మీడియాకు అందుబాటులో లేరు. వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.ఇక పలువురు సీనియర్లు.. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం అధిష్ఠానం వైఖరితో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. ఈ నేపథ్యంలో రేవంత్రెడ్డి సీనియర్లను ఎలా కలుపుకుపోతారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
Also Read