రాజకీయాల నుంచి బయటకొచ్చిన అనంతరం చిరంజీవి ఆచీ తూచీ సినిమాలు చేస్తున్నాడు. రీ ఎంట్రీ తొలి సినిమా ఖైదీ నంబర్ 150 భారీ విజయం సాధించింది. ఈ మూవీ కూడా రీమేకే.. ఆ తర్వాత తన చిరకాల కోరిక అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సైరాలో నటించాడు. అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత లూసిఫర్ అనే మరో రీమేక్లో చిరంజీవి నటించబోతున్నాడు. కానీ ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరిని పెట్టాలని అనే విషయం ఇంకా తేలడం లేదు.
మలయాళ చిత్రం లూసిఫర్ ఎంతో నచ్చడంతో దాన్ని తెలుగులోకి రీమేక్ చేయాలని చిరంజీవి భావించాడు. అయితే దర్శకుడి ఎంపికలోనే జాప్యం జరుగుతోంది. తొలుత సుజిత్ను అనుకున్నారు. ఆ తర్వాత వినాయక్ను పెట్టుకుందామనుకున్నారు. ఆ తర్వాత తమిళ దర్శకుడు మోహన్రాజా చేతిలో ప్రాజెక్ట్ పెట్టాడు. కానీ ఫైనల్ స్క్రిప్ట్ అంత సంతృప్తికరంగా లేదని సమాచారం. దీంతో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ ను ఫైనల్ చేయలేదని టాక్.
లూసిఫర్ ఇప్పటికే డబ్ కావడంతో కథలో చాలా మార్పులు చేయాలని చిరంజీవి భావిస్తున్నాడట. ఇందుకోసం ఇప్పటికే పలువురు రచయితలతో ఆయన చర్చలు జరుపుతున్నారట. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు, క్లైమాక్స్ విషయంలో చాలా మార్పులు చేయాలని చిరంజీవి అనుకుంటున్నారట. అందుకనే ఈ మూవీ విషయంలో క్లారిటీ రావడం లేదని సమాచారం. మొత్తానికి ఈ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ దర్శకుడు ఎవరు? అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావడం లేదు.
Also Read