టీ20 రెండో మ్యాచ్లో పేవలమైన ప్రదర్శనను కనబరిచిన భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ పొట్టి క్రికెట్ నుంచి తప్పుకోవాలని, యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని పలువురు మాజీ క్రికెటర్లు కోరిన సంగతి తెలిసిందే. కొందరు ధోనిని విమర్శించగా…మరి కొందరు మద్దతుగా మాట్లాడారు. ఇప్పుడు తాజాగా కెప్టెన్ విరాట్కోహ్లీ ధోని అంశంపై స్పందించారు.
టీమిండియా మాజీ కెప్టెన్, ‘మిస్టర్ కూల్’ఎంఎస్ ధోనిపై వస్తున్న విమర్శలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక్కడ జరిగిన చివరిదైన టీ20లో న్యూజిలాండ్పై నెగ్గి, సిరీస్ను 2-1తో కైవసం చేసుకున్న అనంతరం కోహ్లీ స్పందించారు. నేను వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమైనా నన్ను విమర్శించరు. ఎందుకంటే నా వయసు 35 ఏళ్లు కాదు కదా. అదే సమయంలో ధోని విఫలమవడం, తక్కువ స్కోర్లు చేసినా విమర్శించడం చేస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఆటగాడు ఫిట్గా ఉన్నాడా, రాణిస్తున్నాడా లేదా అనేది కీలకమని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని కూడా ఏదో ఓ రూపంలో విజయం కోసం పోరాడుతున్నాడు. ధోనీ ఇప్పుడు చాలా ఫిట్గా ఉన్నాడు. ఫిట్నెస్పై నిర్వహించిన అన్ని టెస్టుల్లో పాసవుతున్నాడు. మైదానంలో జట్టు కష్టసమయంలో ఉన్నప్పుడు ఆదుకుంటున్నాడు. శ్రీలంక, ఆస్ట్రేలియా సిరీస్లో ధోనీ బ్యాట్తో బాగానే రాణించాడు. ఈ సిరీస్లో అతనికి ఎక్కువ సమయం మైదానంలో ఉండి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ధోనీ మాత్రమే కాదు ఈ సిరీస్లో హార్దిక్ పాండ్య కూడా అనుకున్న స్థాయిలో రాణించలేదు. మరి అతన్ని ఎందుకు టార్గెట్ చేయరు. ఒక్క ధోనీని మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎందుకు మాట్లాడుతున్నారు. అలా చేయడం సరికాదు’ అని కోహ్లీ అన్నాడు.