ఒక సినిమా డైరెక్ట్ చెయ్యడం అనేది ప్రతీ డైరెక్టర్ కీ కత్తిమీద సాము లాంటి విషయం. తానే కథ రచించి , రచయితగా వ్యవహరించి మరీ డైరెక్షన్ చెయ్యడం అంటే అది పెద్ద సవాల్ అనే చెప్పాలి. సినిమా రంగంలో ఏ డిపార్ట్మెంట్ లో పని చేసేవాళ్ళు అయినా ఒకే సారి రెండు మూడు సినిమాలు చేస్తూ ఉంటారు కానీ డైరెక్టర్ మాత్రం ఒకే ప్రాజెక్ట్ ని నమ్ముకుని ఉంటాడు.
ప్రస్తుతం ట్రెండ్ కొత్తగా కనిపిస్తోంది. ఒక సినిమా చేస్తూ ఉన్న సమయంలో దాని మీదనే దృష్టి పెట్టి మరొక సినిమా గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ తరం దర్శకులు. మొన్నటికి మొన్న పూరీ జగన్నాథ్ లాంటి స్టార్ డైరెక్టర్ ఇద్దరు నందమూరి హీరోలకి ఒకే రోజు కథ చెప్పి మరీ ఒప్పించడం అంటే మామూలు విషయం ఏమీ కాదు. రాం గోపాల్ వర్మ కి ఇలాంటివి అసలు కొత్తేం కాదు. డైరెక్టర్ కిషోర్ తిరుమల ( నేను శైలజ) నితిన్ తో ఒక ప్రాజెక్ట్ ఓకే చెప్పి న ఒక్క రోజు గ్యాప్ లోనే వెంకటేష్ తో సినిమా చేసాడు అని సమాచారం అందరినీ ఆశ్చర్యపరిచింది. మారుతి కూడా ఒక పక్క వెంకటేష్ సినిమా చేస్తూ మరొక పక్క నుంచి రాం చరణ్ కోసం మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న స్క్రిప్ట్ రాస్తున్నాడు. బోయపాటి బన్నీ షూటింగ్ లోనే బాలయ్య కొడుకు ఎంట్రీ కోసం స్కేచ్చ్ గీస్తూనే ఉన్నాడు. ఇలా డైరెక్టర్ లు ఒకే సారి రెండు పడవల మీద కాళ్ళు వెయ్యడం నేర్చుకున్నారు.