దేశంలో మోడీని ఎదిరించే ఏకైక నాయకుడిగా చంద్రబాబునాయుడు ఇప్పటికే గుర్తింపును తెచ్చుకున్నారు. తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్ దగ్గర నుంచి దేశంలోని అనేకమంద ప్రముఖులు ఈ విషయాన్ని ఇప్పటికే మెచ్చుకున్నారు కూడా. ప్రస్తుతం చంద్రబాబు మోడీ పాలనను ఎదిరించడం, తమకు అన్యాయం జరిగిందంటూ కేంద్రంపై ధ్వజమెత్తడం వంటి స్థాయిని దాటిపోయారు. నేరుగా.. స్పష్టంగా.. క్లుప్తంగా.. మోడీ పై వ్యక్తిగత దాడిని చంద్రబాబు ప్రస్తుతం ఆరంభించారు. మోడీ.. ఏమైనా ఆకాశంలోంచి దిగి వచ్చాడా.. రాజకీయాల్లో, ముఖ్యమంత్రిగా తనకంటే చాలా జూనియరే కదా..అనే ధోరణిలో చంద్రబాబు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. అవి కూడా అలా.. ఇలా కాదు.. చాలా ఘాటుగా సంధిస్తున్నారు. తాజాగా చంద్రబాబు నోటి వెంట మోడీ గురించి వచ్చిన తీవ్ర విమర్శలను వింటే.. తాడో పేడో తేల్చుకుంటే తప్ప వదిలేలా కనిపించడం లేదని స్పష్టంగా అర్థమైంది.
@ మోడీ నాకంటే చాలా జూనియర్.. నేను 1995లో సీఎం అయ్యాను, అప్పటికి మోడీ ఏం కాదు, తర్వాత ఏడేళ్లకు 2002లో సీఎం అయ్యాడు. రాజకీయాల్లోకి కూడా నాకంటే చాలాకాలం తర్వాత వచ్చారంటూ చంద్రబాబు వెళ్లడించారు. ఏదో ప్రధాని అయ్యేందుకు అవకాశం వచ్చిందని తానుకూడా పెద్దమనుసుతో సహకారం అందిస్తే.. ఇప్పుడు తనపైనే విషం చిమ్ముతున్నారంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
@ నేను నీతి, నిజాయతీతో పాలన అందిస్తున్నాను. నన్ను ఎవరూ ఏం చేయలేరు. సహకారం అందించిన పాపానికి ఇప్పుడు రాష్ర్టానికి ఎలాంటి సాయం చేయకపోగా.. నాకే నోటీసులంటూ భయపెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి వాటికి భయపడే రకం కాదు నేను. రాష్ర్టంలోని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్లు కేసులకు భయపడి మోడీ చెప్పినట్టు ఆడతారు.. తన దగ్గర అలాంటి పప్పులు ఉడకవు.
@ తాజాగా విజయవాడలో జరిగిన ఓ సదస్సులో ఓ విద్యార్థిని సోలార్, విండ్ విద్యుత్తు గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వగా.. నువ్వు చాలా బాగా చెప్పావంటూ చంద్రబాబు మెచ్చుకున్నారు. నీకు ఉన్న ఈ ఆలోచన ప్రధాని మోడీకి ఉండి ఉంటే.. ఎప్పుడో దేశంలో విద్యుత్తు ఛార్జీలు తగ్గేవి. ఆయన ఎప్పుడూ విదేశాలను పట్టుకుని తిరగడం తప్ప.. ఇలాంటి ఆలోచన చేసింది లేదు.
@ మోడీ ప్రధానిగా వస్తే.. దేశం బాగుపడుతుందని, అభివృద్ధి సాధిస్తుందని అంతా అనుకున్నారు. నేను కూడా అందుకే సహకారం అందించాను. కానీ.. దేశాన్ని మళ్లీ వెనక్కు తీసుకెళ్లిపోయారు. చివరికి ఎవరి డబ్బులు వాళ్లు బ్యాంకులోంచి తీసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. కొందరు నాయకులు వస్తే.. దేశం బాగుపడుతుంది. కొందరు వస్తే.. దేశం అథోగతి పడుతుంది. అలా అథోగతి పట్టించిన నాయకుడు నరేంద్రమోడీ.