నోట్ల రద్దు సమయంలో ఏటీఎంల వద్ద పడిగాపులు కాసిన చేదు రోజులు అందరికీ గుర్తే ఉంటాయి. పెద్ద నోట్లు రద్దు అయి రెండేళ్లు పూర్తి కావస్తున్న దాని ఫలితంగా ఎదురయ్యే కష్టాలు మాత్రం నేటికి వెంటాడుతూనే ఉన్నాయి. కష్టాలు పూర్తిగా తీరకముందే మరో పిడుగు లాంటి వార్తను కాన్ఫెడరేషన్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) పేల్చింది.
దేశంలో ఉన్న సగం ఏటీఎంలు త్వరలో మూతబడబోతున్నాయి. మెల్లిమెల్లిగా ఏటీఎంలు మూసివేస్తూ వస్తున్న బ్యాంకులు… వచ్చే ఏడాది మార్చి నాటికల్లా సగం ఏటీఎంలను ఎత్తివేయబోతున్నారనే వార్త ఖాతాదారులను బెంబేలెత్తిస్తోంది. 2019 మార్చి కల్లా దేశంలో 2.38 లక్షల ఏటీఎంల్లో 1.13 లక్షల ఏటీఎంలు మూతపడతాయని తమ నివేదికలో పేర్కొంది.
బ్యాంకింగ్ చట్టంలో వచ్చిన మార్పులు, ప్రభుత్వరంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న నష్టాల కారణంగా ఏటీఎంల నిర్వహణ భారంగా మారింది. అదీగాక బ్యాంకింగ్ కార్యకలాపాల్లో పటిష్ట నియంత్రణ తీసుకురావాలనే ఆలోచన సైతం ఉంది. ఇందులో భాగంగా లెక్కకు మించి ఉన్న ఏటీఎంలను వీలైనంత త్వరగా మూసివేయాలని నిర్ణయించింది కాన్ఫడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ.
కొత్త కరెన్సీ నోట్ల కారణంగా ఏటీఎం మెషిన్లలో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయడం, క్యాష్ లోడింగ్కు అనుసరిస్తున్న క్యాసెట్ స్వాపింగ్ పద్ధతి కూడా మార్చాల్సిరావడంతో ఖర్చు భారీగా పెరిగిపోయిందట. కొత్త టెక్నాలజీ అప్గ్రేడ్ చేసేందుకే రూ. 3 వేల కోట్లు అదనంగా ఖర్చవుతోందని అంచనా వేసింది సీఏఏఐ.
పటిష్ట నియంత్రణల ముఖచిత్రంలో మార్పుల కారణంగా ఏటీఎంల ఆపరేషన్ ఆచరణ సాధ్యం కాకపోవచ్చని, ఫలితంగా లెక్కకుమించి ఏటీఎంల మూత తప్పకపోవచ్చునని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. మూసివేస్తున్న ఏటిఎంలు ఎక్కువగా ఊరికి దూరంగా, మారుమూల పల్లెల్లో ఉన్న ఏటీఎంలే ఉండడం విశేషం.
ఒక లక్షా 13 వేల ఏటీెంలను సర్వీస్ ప్రొవైడర్లు బలవంతంగా మూసివేయాల్సి రావచ్చని ఏటీఎం ఇండస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిలో లక్ష ఏటీఎంలు ఊరికి దూరంగా, మారుమూల పల్లెల్లో ఉన్న ఏటీఎంలే ఉండడం విశేషం. వీటిని మూసివేస్తే ప్రభుత్వ సబ్సిడీలను తీసుకునే గ్రామప్రజలు ఇబ్బందుల్లో పడతారు.