తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలు మొరాయించాయి. పోలింగ్ స్టేషన్లలో సరైన వసతులు కల్పించలేదని పలుచోట్ల ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల పోలింగ్ బూత్లలో కనీసం లైట్లు కూడా సరిగా లేవని ఓటర్లు ఆందోళన చేస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పెద్దసంఖ్యలో ఓటు వేయగా.. హైదరాబాద్ నగరంలో మాత్రం ఎప్పటిలాగే ఓటర్లు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో నగరంలోని చాలా నియోజకవర్గాల్లో అతి తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. చంద్రాయణగుట్ట, నాంపల్లి నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటింగ్పై అంతగా ఆసక్తి చూపకపోవడంతో దారుణమైన పోలింగ్శాతాలు నమోదయ్యాయి.
ఇక సమస్యాత్మక ప్రాంతాలైన 13 నియోజకవర్గాల్లో 4 గంటలకే ముగిసింది. పోలింగ్ విషయానికొస్తే పట్టణాల్లో ఓటింగ్ కాస్త మందకొడిగా సాగగా.. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త పెరిగింది. ఫలితాలు ఈ నెల 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
ఐదు గంటల లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకుని క్యూలైన్లో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 69శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో సాయంత్రం 4 గంటల వరకు 67 శాతం నమోదైనట్లు సమాచారం